గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా శంకుస్థాపన

by  |
గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా శంకుస్థాపన
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా ఒకేరోజు సచివాలయంలో మందిరం, మసీదు, చర్చికి శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఖర్చుతోనే మందిరం, మసీదు, చర్చిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 750చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్ క్వార్టర్స్‌‌‌తో సహా మొత్తం 1500 చదరపు అడుగులతో రెండు మసీదుల నిర్మాణం, పాత సెక్రటేరియట్‌లో ఉన్న స్థలంలోనే పూర్తి చేస్తామని, ఆ తర్వాత వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తామని తెలిపారు. క్రిస్టియన్ల కోరిక మేరకు కొత్త సచివాలయంలోనే చర్చిని నిర్మాస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుందని అందుకే కొత్త సచివాలయంలో అన్ని మతాల ప్రార్థనా మందిరాలను నిర్మించబోతుందన్నారు.

గురువారం ప్రగతి‌భవన్‌లో ముస్లిం మతపెద్దలతో సమావేశమైన కేసీఆర్ ఈ కామెంట్లు చేశారు. భేటీకి హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్, పలువురు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు హాజరై కొత్త సెక్రటేరియట్ నిర్మాణంతో పాటు, ఇతర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి, విద్య నేర్పించే అనీస్ ఉల్ గుర్భా నిర్మాణం ఇప్పటికే 80శాతం పూర్తయ్యిందని, మరో రూ.18 కోట్లు విడుదల చేసి అనీస్ ఉల్ గుర్భా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇస్లామిక్ సెంటర్ నిర్మాణం చేపడుతామని, దీనికి ఇప్పటికే స్థలం కేటాయించినట్లు తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఖబ్రస్థాన్‌లు రావల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.



Next Story