చిట్టచివరి రైతుకూ రైతుబంధు అందాలి

by  |
చిట్టచివరి రైతుకూ రైతుబంధు అందాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్టచివరి రైతు వరకూ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 99.9 శాతం మంది రైతులకు ఈ సాయం అందిందని, ఇంకా ఎవరికైనా అందకపోతే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ వివరాలను సేకరించి అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ. 25కోట్ల ఖర్చుతో అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి నిర్మించనున్నట్లు తెలిపారు. ఏడాది కాలంలోగా నిర్మాణం పూర్తయ్యి అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

“కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతుబంధు విడుదల చేసింది. ఏ ఒక్కరూ మిగలకుండా చిట్ట చివరి రైతు వరకు రైతుబంధు సాయాన్ని అందించాలి. మంత్రులు వారివారి జిల్లాలో, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో రైతుబంధు సాయం అందిందో లేదో తెలుసుకుని, అందించే ఏర్పాట్లు చేయాలి. రైతుబంధు సాయానికి టైమ్ లిమిట్ లేదు. చివరి రైతుకు సాయం అందేదాకా విశ్రమించొద్దు. వంద శాతం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఒక్క రైతు కూడా రైతుబంధు సాయం అందలేదనే మాట రావద్దు” అని సీఎం నొక్కిచెప్పారు.

భూ యాజమాన్య హక్కులపై దృష్టి పెట్టాలి

“కాస్తులో ఉన్నప్పటికీ కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ కారణంగా రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించాలి. సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. యాజమాన్య హక్కు గుర్తించడానికి ‘మోకా మైనా’ (స్పాట్ ఎంక్వైరీ) నిర్వహించాలి. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలి. అందరికీ సాయం అందించాలి. రైతుబంధు సమితుల, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. ఒక సారి పరిష్కారం అయిపోతే, ఎప్పటికీ గొడవ ఉండదు. అది అన్ని తీర్లా మంచిది. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదు. ఆ జిల్లా మంత్రి మల్లారెడ్డి చొరవ తీసుకుని గ్రామంలో సర్వే జరిపించారు. ఏ భూమికి ఎవరు యజమానులో నిర్ధారణ అయింది. మిగతా చోట్ల కూడా అదే జరగాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

నియంత్రిత సాగు గొప్ప విజయం

”ప్రభుత్వం సూచించిన మేరకు రైతులు వంద శాతం నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేస్తున్నారు. ఇది శుభసూచకం. భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించింది. ఆ ప్రకారమే వానాకాలం పంటల సాగు జరుగుతోంది. మక్కల సాగు వద్దనడంతో ఎవరూ వేయలేదు. ఇది గొప్ప పరివర్తన. రైతుల స్పందన ప్రభుత్వానికి స్పూర్తిదాయకం. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం పనిచేయడానికి ఇది ప్రేరణ” అని కేసీఆర్ ప్రకటించారు.

దసరాకల్లా రైతు వేదికలు:

రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, మిగిలినచోట్ల దసరాలోగా పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలని సీఎం స్పష్టం చేశారు. ఇది పూర్తయితే రక్షణ వేదికలు అవుతాయన్నారు.

విత్తనాల నిల్వకు అల్ట్రా మోడర్న్ స్టోరేజీ

‘తెలంగాణ వ్యవసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతున్నదని, భారీ స్థాయిలో విత్తనోత్పత్తి జరుగుతున్నదని, అలా తయారు చేసిన విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ. 25 కోట్ల వ్యయంతో అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నిధులను వెంటనే విడుదల చేస్తామని, ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలన్నారు.


Next Story

Most Viewed