కేసీఆర్ అతిపెద్ద నేరస్థుడు : భట్టి విక్రమార్క

by  |
కేసీఆర్ అతిపెద్ద నేరస్థుడు : భట్టి విక్రమార్క
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన, సీఎం ఫామ్‌హౌస్‌కు పారిపోయి అతిపెద్ద నేరస్థుడు అనిపించుకున్నాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ అసమర్థ నిర్ణయాల వల్లే రాష్ట్రమంతా కరోనా బారిన పడ్డారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ప్రజలను పట్టి పీడిస్తున్న తరుణంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, ప్రజలకు సేవ చేయాలని డిమాండ్ చేశారు.

అందరికీ ఉచిత వైద్యాన్ని అందించాలన్నారు. మన దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల పోస్టులు, నర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలన్నీ ఖాళీగా ఉన్నాయని అన్నారు. చాలా చోట్ల సరైన సౌకర్యాలు కూడా లేవన్నారు. ఉన్న అరకొర వసతులతో డాక్టర్లు సేవ చేస్తున్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరున్నరేండ్లలో కేసీఆర్ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా నిర్మించలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలను పూర్తిగా గాలికి వదిలేసి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో దాక్కున్నారని అన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. ఉద్యమమంతా ఉద్యోగాల కోసమే అని చెప్పి ఇన్నేళ్లలో ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా అని భట్టి ప్రశ్నించారు. 30 పడకల ఆసుపత్రిగా ఉన్న మేడ్చల్ ఆసుపత్రిలోనూ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు. జిల్లా ఆసుపత్రిగా ఎప్పుడో అప్‌ గ్రేడ్ కావాల్సిన ఈ ఆసుపత్రి ఇంకా అలాగే ఉందని అన్నారు. కొవిడ్ విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా, వసతులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed