‘ధరణి’లో అనేక లోపాలు.. హ్యాక్ ఐతే ఎలా?

by  |
‘ధరణి’లో అనేక లోపాలు.. హ్యాక్ ఐతే ఎలా?
X

దిశ, న్యూస్‌బ్యూరో: నూతన రెవెన్యూ బిల్లుపై శాసనసభలో శుక్రవారం సుదీర్ఘ చర్చ జరిగింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్ పలు అంశాలపై మాట్లాడారు. ధరణి వెబ్‌సైట్‌లో లోపాలు ఉన్నాయని, అసైన్డ్‌ భూముల ఎంట్రీ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. గ్రామాల్లో ఏటా జరిగే జమాబందీ, సమగ్ర భూ సర్వే చేయకపోతే సమస్యలు అలాగే ఉంటాయని, భూ సర్వే ఎప్పుడు, ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు.

భూముల డిజిటలైజేషన్ ప్రక్రియ మంచిదే అయినప్పటికీ ధరణి సర్వర్‌ ఎవరైనా హ్యాక్‌ చేసి రికార్డ్స్‌ మార్చితే ఎలా అని, మాన్యువల్‌ రికార్డులు కూడా ఉండేట్టు చూడాలని ప్రభుత్వానికి సూచించారు. చాలా సందేహాలు ఉన్నాయని అన్నారు. వ్యవసాయ రుణాలు తీసుకునే విషయంలో పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ మార్టిగేజ్ చేయాలని అడుగుతున్నారని, నిబంధనల్లో లేకున్నా అమాయక రైతులు ఇవ్వాల్సి వస్తుందన్నారు. వ్యవసాయ భూములన్నీ తహసీల్దార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని కొత్త చట్టంలో చెబుతున్నారని, డిజిటలైజేషన్ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని వెల్లడించారు.

ప్రతి భూ పోరాటం తెలంగాణ ఉద్యమంగా మారిందని భట్టి వివరించారు. పేదలు శిఖం భూమిని సాగు చేసుకుంటారన్నారు. నదీ పరివాహక ప్రాంతంలోనూ సాగు చేసుకుంటారన్నారు. దీనిలో వారు అనుభవదారులుగా ఉంటున్నారని, వారసులు కూడా ఆ భూములపై ఆధారపడి ఉన్నారని, ఇప్పుడు అనుభవదారు కాలాన్ని తొలగిస్తే అన్యాయం జరుగుతుందన్నారు. 2016-17లో ల్యాండ్ రికార్డు అప్‌డేషన్ గురించి ఇదే సభలో చర్చించినట్లు చెప్పారు. అన్నీ సక్రమంగా ఉన్న భూములనే ఎంట్రీ చేశారన్నారు. కొంతమంది భూములను కీ తమ దగ్గర లేదంటూ తహసీల్దార్లు నిరాకరించారని అన్నారు.

లిటిగేషన్ భూములను కూడా పెండింగ్ పెట్టారన్నారు. అప్‌డేట్ చేసిన రికార్డులు ధరణి పోర్టల్‌కు మార్చినట్లు చెప్పారన్నారు. దీనిపై కూడా సమస్యలున్నాయని పేర్కొన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ యజమానులు చనిపోతే వారసులకు ఎంట్రీ కావడం లేదని, ఇలా 15 శాతం ఈ భూములున్నాయని వివరించారు. 16 వేల కేసుల వరకు కోర్టులో ఉన్నాయని, వాటిని ఎలా ఎంట్రీ చేస్తారనేది చెప్పడం లేదన్నారు. సమగ్ర భూ సర్వే చేయకుంటే కొత్త చట్టం వచ్చినా ఫలితం ఉండదన్నారు. ధరణిలో డిజిటలైజేషన్‌తో పాటుగా మాన్యువల్‌గా కూడా రికార్డులు చేయాలని సూచించారు.

జమాబందీ కొనసాగించాలి..

క్రయ విక్రయాలను డిజిటలైజేషన్ చేసినా, జమాబందీ అమలు చేయాలన్నారు. రెవెన్యూ కోర్టులు తొలగించి ట్రిబ్యునల్ పెట్టాలనుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారని, రెవెన్యూ కోర్టులకు వెళ్లేందుకే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరణి వెబ్‌లో అటవీ భూములు ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారిందని, రిజర్వు ఫారెస్ట్ అనేది బ్రిటిష్ కాలంలో చేశారని, 2006లో ఫారెస్ట్ ల్యాండ్స్‌లో కొందరికి హక్కులు కల్పించారని వివరించారు. వ్యక్తులుగా కాకుండా కమ్యూనిటీకి కూడా హక్కు కల్పించారని, గుట్టలపైన దేవుళ్లు కోసం కొంత కల్పించారని, ఉదాహరణకు సమ్మక్క, సారలక్క వంటి దేవుళ్లకు గుట్టలు కేటాయించారని, ఇప్పుడు ధరణి వెబ్‌సైట్‌లో వాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అనుమానాలున్నాయని సభా ముందుకు తీసుకొచ్చారు.

ఇప్పటికే తండ్రి, కొడుకుల వారసత్వ భూముల్లో తండ్రి పట్టాదారు, కొడుకులు అనుభవదారుల్లో ఉంటారని, అలాంటి వాటిని ఎలా పరిష్కరిస్తారని సీఎల్పీ నేత ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు, వ్యవసాయేతర భూములు, దేవాదాయ భూములకు సంబంధించి ధరణిలో ఏ రకంగా పరిగణనలోకి తీసుకుంటారో వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. సమగ్ర సర్వే సెటిల్‌మెంట్ పూర్తయ్యే వరకు ప్రస్తుత విధానం కొనసాగిస్తే బాగుంటుందన్నారు. ల్యాండ్ రెవెన్యూ సీసీఎల్ఏ పోస్టులో ఫుల్ టైం అధికారి ఉండాలని భట్టి సూచించారు.



Next Story