అమెరికా నౌకలే లక్ష్యంగా చైనా మిస్సైల్స్ లాంచింగ్..

by  |
అమెరికా నౌకలే లక్ష్యంగా చైనా మిస్సైల్స్ లాంచింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ శక్తిగా అవతరించేందుకు చైనా రకరకాల కుయుక్తులు పన్నుతోంది. మొన్నటిదాకా ఇండియాతో సరిహద్దు విషయంలో కయ్యం పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ.. తాజాగా దక్షిణ మహాసముద్రంలో నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో భాగంగా అమెరికా యుద్ధనౌకలే లక్ష్యంగా మిస్సైల్స్ లాంచ్ చేసింది. ఈ విషయాన్ని అమెరికా కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

రెండు అమెరికా విమాన వాహక యుద్ధ నౌకలు, అమెరికా సైనిక కేంద్రాల దిశగా దూసుకొచ్చిన నాలుగు క్షిపణులు తమ లక్ష్యాలకు కొంత దూరంలో సముద్రంలో కూలిపోయాయి. అమెరికా వాహక నౌకలు దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తే వాటిని క్షిపణులతో పేల్చేస్తామని ఈ మేరకు హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే, చైనా ప్రయోగించిన క్షిపణుల్లో అత్యంత శక్తివంతమైన, వ్యూహాత్మ ఆయుధాలైన డీఎఫ్-21డీ, డీఎఫ్-26డీ ఉన్నట్లు ఆ దేశ సైనిక వర్గాలు తెలిపాయి.

తమ వైపుకు వచ్చిన క్షిపణుల్లో నాలుగు మధ్యంతర శ్రేణి, ఖండాతర క్షిపణులు ఉన్నట్లు అమెరికా సైనికాధికారి ఒకరు వెల్లడించారు. అయితే, అవి దక్షిణ చైనా సముద్రంలోని హైనాన్ ద్వీపం, వియత్నాం సమీపంలో వివాదాస్పద పారాసెల్ గొలుసు ప్రాంతంలోని అమెరికా యుద్ధ నౌకలు ఉన్న సమీపంలో పడినట్లు గుర్తించారు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ సైనిక విన్యాసాలు నిర్వహించడం అక్కడ ఉద్రిక్తతలు పెంచేందుకేనని పెంటాగాన్ ఆరోపించింది. చైనా క్షిపణుల ప్రయోగంతో ఈ ప్రాంతం పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చునని ప్రకటించింది.

తమ సైనిక విన్యాసాలు ఏ దేశాన్ని ఉద్దేశించినది కాదని చైనా గురువారం పేర్కొంది. అమెరికా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా భయపడబోమని చైనా రక్షణ ప్రతినిధి సీనియర్ కర్నల్ వు కియాన్ అన్నారు. తమ గగనతలంలోకి అమెరికా నిఘా విమానాలు ఎగరడాన్ని ఆయన ఖండించారు. కాగా, దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక విన్యాసాలపై అమెరికా స్పై విమానాలు నిఘా పెట్టాయి. బధవారం కూడా వరుసగా రెండోసారి చైనా గగనతలం మీదుగా అమెరికా గూఢచార విమానాలు ఎగిరాయి.

మంగళవారం దక్షిణ చైనా సముద్రంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విన్యాసాలు చేస్తున్న దిశగా యూఎస్ యూ-2 చాలా ఎత్తులో ఎగిరింది. బుధవారం కూడా మరో నిఘా విమానం యూఎస్ ఆర్సీ-135ఎస్ దక్షిణ చైనా సముద్రంలోనే మరో చోట జరుగుతున్న చైనా విన్యాసాలను రహస్యంగా ఫోటోలు తీసింది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ఏక కాలంలో మూడు చోట్ల సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. దీంతో తైవాన్, జపాన్, అమెరికా నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నదని రక్షణ రంగ నిఫుణులు అంచనా వేస్తున్నారు.


Next Story