ప్యాంగాంగ్‌లోనూ ‘హద్దు’ మీరిన డ్రాగన్

by  |
ప్యాంగాంగ్‌లోనూ ‘హద్దు’ మీరిన డ్రాగన్
X

న్యూఢిల్లీ: సమస్యాత్మక సరిహద్దు ప్రాంతంలో చైనా దూకుడు పెంచింది. బలగాల మోహరింపును పెంచుతూనే ఉన్నది. నిర్మాణాలనూ చేపడుతున్నది. క్రమంగా భారత సైనికుల పెట్రోలింగ్‌ను అడ్డుకుంటూ ముందుకు వస్తున్నది. తాజాగా, ప్యాంగాంగ్ సరస్సు సమీపంలోని ఫింగర్ 4, ఫింగర్ 5ల మధ్య మాండరిన్ భాషలో అక్షరాలతోపాటు చైనా మ్యాప్‌ను చెక్కింది. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామనే రీతిలో వ్యవహరిస్తున్నది.

సరిహద్దులో పర్వత శిఖరాలుగా మొనదేలినవాటిని ఫింగర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్యాంగాంగ్ లేక్ తీరంలో ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు ఉన్న భూభాగం సమస్యాత్మకంగా మారింది. ఎందుకంటే ఫింగర్ 1 నుంచి ఫింగర్ 8 వరకు పెట్రోలింగ్ చేసే హక్కు భారత్‌కు ఉన్నదని, ఆ ప్రాంతాలపై భారత్‌దే సార్వభౌమత్వ హక్కు అని భావిస్తున్నది. కాగా, ఫింగర్ 8 నుంచి ఫింగర్ 4 వరకు పెట్రోలింగ్ చేసే హక్కు తమకే ఉన్నదని చైనా భావిస్తున్నది. మే నెలలో ఉద్రిక్తతలు ఈ నేపథ్యంలోనే చోటుచేసుకున్నాయి. ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు పెట్రోలింగ్ చేసేందుకు ఉపక్రమించిన భారత సైన్యంపై ఫింగర్ 4 దగ్గరే చైనా ఆర్మీ విరుచుకుపడింది. ఈ ఘర్షణలో పదుల సంఖ్యలో భారత సైనికులు గాయపడినట్టు రిపోర్టులు వచ్చాయి. అనంతరం జరిగిన మొదటి రౌండ్ మిలిటరీ శాంతి చర్చల్లో చైనా ఆర్మీ తిరిగి ఏప్రిల్ పొజిషన్‌లోకి వెళ్లేందుకు అంగీకరించింది కూడా. కానీ, వెనక్కి వెళ్లకపోగా ఫింగర్ 4 దగ్గరే పాగా వేసింది. తాజాగా, ఫింగర్ 4, ఫింగర్ 5 మధ్యలో 81 మీటర్ల పొడువు, 25 మీటర్ల అడ్డంతో శాటిలైట్ చిత్రాల్లో కనిపించే స్థాయిలో చైనా చిత్రపటాన్ని, ఆ దేశ భాష మాండరిన్ అక్షరాలను ఏర్పాటు చేసింది. మొత్తంగా ఆ సరస్సు తీరం, సమీప ప్రాంతాల్లోనూ కనీసం 186 మిలిటరీ గుడిసెలు, గుడారాలను ఏర్పాటు చేసుకుంది. ఫింగర్ 5 దగ్గర చైనా యుద్ధ సామాగ్రి కూడా శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. ఫింగర్ 4 వరకూ ఇప్పటికీ నిర్మాణ పనులు జరుగుతున్నట్టు చిత్రాలు వెల్లడిస్తున్నాయి. కాగా, గాల్వాన్ లోయలో గతంలో చైనా స్వయంగా వాదించుకున్న సరిహద్దు ప్రాంతాన్నీ దాటి భారత భూభాగంలోకి సుమారు 423 కిలోమీటర్లు చొచ్చుకొచ్చినట్టు ఉపగ్రహాల చిత్రాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

మూడో రౌండ్ శాంతి చర్చలు

ఈ నేపథ్యంలోనే మూడో రౌండ్ మిలిటరీ శాంతి చర్చలు మంగళవారం లడాఖ్‌లోని చూశుల్‌లో ముగిశాయి. భారత్ అంగీకరించకున్నా, చైనా వాదిస్తున్న సరిహద్దు వరకూ భూభాగాన్ని స్వాధీనపరుచుకునే దిశలో ఆ దేశం శాయాశక్తులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా, ఉద్రిక్తతల తొలగింపునకు, బలగాల ఉపసంహరణకు చర్చల్లో చైనా అంగీకరించడం కష్టతరంగానే తోస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దులో ఉద్రిక్తతలు సమసిపోవడానికి సుదీర్ఘకాల చర్చలు, సమయమూ పట్టవచ్చునని చెబుతున్నారు.


Next Story

Most Viewed