మాట తప్పారు.. మడమ తిప్పారు

by  |
మాట తప్పారు.. మడమ తిప్పారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అమరావతిపై జగన్ మాటతప్పారని, అందుకే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామని రెండ్రోజుల క్రితం మీడియా సమావేశంలో సవాల్ విసిరిన చంద్రబాబు.. 48గంటల డెడ్‌లైన్ ముగియడంతో బుధవారం మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. గతంలో వైఎస్ జగన్, వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలను… ‘మాట తప్పారు.. మడమ తిప్పారు’ పేరిట రిలీజ్ చేశారు. జగన్‌, బొత్స సత్యనారాయణ, రోజా, అవంతి శ్రీనివాస్‌‌తో పాటు వైసీపీ నేతలకు సంబంధించిన వ్యాఖ్యలను అందులో చూపించారు. జగన్‌కు కనువిప్పు కలగాలనే ఈ వీడియోను రిలీజ్ చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామని వైసీపీ నేతలకు సవాల్ విసిరితే భయపడి పారిపోయారన్నారు. రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు. నాడు ఏకపక్షంగా రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు దానికంటే ఎక్కువగా తీరని మోసం చేస్తున్నారని, ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై 5కోట్ల మంది ఆంధ్రులు ఆలోచించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. భావితరాల భవిష్యత్‌ను నాశనం చేసేందుకు వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారని.. రాజధానికి 33వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

నా పోరాటం ప్రజల కోసం

నా పోరాటం.. నా కుటుంబం, పార్టీ కోసం కాదని ఐదుకోట్ల మంది ప్రజల కోసమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. గతంలో మీరు అమరావతిని అంగీకరించారు కాబట్టి రాజధానిని తరలించడానికి వీళ్లేదన్నారు. అసలు ప్రజల అనుమతి లేకుండా మూడు రాజధానులను ఏర్పాటు చేసే అధికారం మీకు ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. కరెంట్ తీగను పట్టుకుంటే ఏమవుతుందో.. జగన్‌కు ఓటేస్తే అదే జరుగుతుందని నేను ఎన్నికల సమయంలోనే చెప్పానని ఇప్పుడు అదే జరుగుతుందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి ఆగిపోతుందని చెప్పానని గుర్తు చేశారు.

విశ్వసనీయత లేని ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం విశ్వసనీయత లేదని, సీఎం జగన్‌కు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదన్నారు. న్యాయం రైతులు వైపు ఉంది కాబట్టే నిన్న కోర్టులో మూడు రాజధానుల అంశంపై స్టే వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను నమ్మించి గొంతు కోసిందని.. ఐదుకోట్ల ప్రజలను కాపాడేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని, దీన్ని విశాఖ వాసులు అర్థం చేసుకోవాలన్నారు. ఏడాది కాలంలో అక్కడ ఎన్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయో రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. అసలు అమరావతిలో రాజధాని ఎందుకు ఉండాలన్న విషయంపై రెండ్రోజుల్లో పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానని తెలిపారు.

బ్లీచింగ్ ఫౌడర్ చల్లితే కరోనా పోతుందా !

అమరావతి, మూడు రాజధానుల అంశంపై మాట్లాడుతూనే రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చంద్రబాబు మాట్లాడారు. కరోనా విషయంలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని రోజుకు 10వేలకు పైగా పాజిటివ్‌లు వస్తున్నాయన్నారు. బ్లీచింగ్ ఫౌడర్ చల్లితే కరోనా వైరస్ పోతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


Next Story

Most Viewed