టీడీపీని తుదముట్టించాలనే కుట్రతోనే దాడి చేశారు: చంద్రబాబు

by srinivas |
Chandrababu
X

అమరావతి: మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో 36 గంటల నిరసన దీక్ష చేస్తున్నామని… ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ దీక్ష చేపట్టినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో దాడి జరిగింది కాబట్టే ఇక్కడే దీక్షకు కూర్చున్నామని వెల్లడించారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు గురువారం ఉదయం 8గంటలకు పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..70లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయం ఇది అని చెప్పుకొచ్చారు.

పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పట్టాభి ఇంటిపై దాడి చేశారని..8ఏళ్ల చిన్నారిని భయపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ కార్యాలయంపై దాడి జరగబోతోందని మంగళవారం సాయంత్రం 05:03కి డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదని మరోసారి ఆరోపించారు. ఇతర పోలీస్ ఉన్నతాధికారులకు యత్నించినా స్పందన కరువైందన్నారు. దీంతో వెంటనే గవర్నర్‌కు ఫోన్ చేస్తే ఆయన స్పందించారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం మొత్తం ఏకకాలంలో టీడీపీ కార్యాలయాలు, నేతలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి చేస్తున్న దాడిపై తక్షణమే స్పందించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కోరామని పేర్కొన్నారు. ఇది ప్రజలపై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని చంద్రబాబు అభివర్ణించారు. తనకేమైనా పర్లేదు అని వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్షలో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed