‘విషాదాన్ని అవకాశంగా మలిచాం’

by  |
‘విషాదాన్ని అవకాశంగా మలిచాం’
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కరోనా విషాదాన్ని ఒక అవకాశంగా మలిచిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అంతేకాదు, ఆర్థిక వ్యవస్థను గాడితప్పకుండా కాపాడగలిగిందని చెప్పారు. బీజేపీ ఒడిషా ఎగ్జిక్యూటీవ్ కమిటీని ఉద్దేశిస్తూ నడ్డా శనివారం మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న దశలో శక్తివంతమైన దేశాలే గందరగోళంలో మునిగినప్పుడు ప్రధాని మోడీ మాత్రం స్పష్టమైన ప్రణాళికతో, దూరదృష్టితో లాక్‌డౌన్‌ను విధించి 130కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగారని అన్నారు.

లాక్‌డౌన్ విధించినప్పుడు ఒక్క కొవిడ్ ఆస్పత్రి కూడా లేదని, కానీ, ఇప్పుడు 2.5లక్షల పడకల వసతితో కనీసం 1,500 ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఆరోగ్య సంబంధ విషయాలతోపాటు ఆర్థికాంశాలపైనా ప్రధాని దృష్టి ఉంచారని తెలిపారు. గరీబ్ కళ్యాణ్, ఆత్మనిర్భర్ భారత్‌లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. యూఎన్ సెక్రెటరీ జనరల్ కూడా భారత్‌పై ప్రశంసలు కురిపించారని పేర్కొన్నారు. కరోనా విసిరిన సవాళ్లు, సమస్యలను కేంద్ర ప్రభుత్వం అవకాశాలుగా మలుచుకుందని చెప్పారు. 23.9 శాతం మేర జీడీపీ కుచించుకుపోవడంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.


Next Story