తాగునీటి అంశంపై చేతులెత్తేసిన కేంద్ర జల్‌శక్తి

by  |
తాగునీటి అంశంపై చేతులెత్తేసిన కేంద్ర జల్‌శక్తి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా జలాల్లో తాగునీటి అంశంలో కేంద్ర జల్‌శక్తి చేతులెత్తేసింది. మీ పంచాయతీ మీదే…మీరే తేల్చుకోండి అంటూ తేల్చి చెప్పింది. బచావత్ ట్రిబ్యునల్‌కు ముడి పెట్టింది. రెండు రాష్ట్రాల పంచాయతీని తేల్చమంటూ స్పష్టం చేసింది. బచావత్ ఏడో క్లాజుపై కేంద్ర జల్‌శక్తి ఇరురాష్ట్రాలకు లేఖ రాసింది. తాగునీటికి కేటాయించే నీటిలో 20శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనే దానిపై 2018లో అప్పటి కేఆర్ఎంబీ ఛైర్మన్ నిర్ణయం ప్రకారం ట్రిబ్యునల్‌లో పరిష్కరించుకోవాలంటూ కేంద్రం రాసిన లేఖలో చెప్పింది. బచావత్ అవార్డును అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో దాన్ని బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు ముడిపెట్టింది. అవార్డులోని ఏడో క్లాజు ప్రకారం హైదరాబాద్ సహా పలు నగరాలకు వినియోగించే కృష్ణా జలాల తాగునీటి లెక్కల్లో 80శాతం తిరిగి నదుల్లోకి చేరుతుందని, మిగిలిన 20 శాతం మాత్రమే తాగునీటికి వినయోగమవుతుందని, దీని ప్రకారం 20శాతమే పరిగణలోకి తీసుకోవాలని సవివరంగా ఏళ్ల నుంచి కోరుతున్నారు. తెలంగాణలో ఏటా తాగునీటి కోసం వాడుతున్న సుమారు 36.5 టీఎంసీల్లో 7.3టీఎంసీలను మాత్రమే లెక్కించాలని తెలంగాణ పేర్కొంటోంది.

బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తాగునీటి అవసరాలకు కేటాయించిన 20శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. అయితే తెలంగాణ వాదనతో ఏపీ ఏకీభవించడం లేదు. అంతేకాకుండా ఏపీ వినియోగిస్తున్న తాగునీటిని కూడా అదే రీతిన లెక్కించాలని చెప్పుతూ వస్తోంది. అయితే ఏపీ తాగునీటి కోసం వాడుతున్న నీరు ఎక్కువగానే ఉంటోంది. రెండు రాష్ట్రాలు దీనిపై పట్టుమీద ఉంటున్నాయి. అయితే రెండు రాష్ట్రాలు దీనిపై అంగీకారానికి రాకుంటే ట్రిబ్యునల్‌లోనే తేల్చుకోవాలని 2018లో బోర్డు ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారని, దాని ప్రకారమే ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలంటూ కేంద్ర జల్‌శక్తి రెండు రాష్ట్రాలకు సూచించింది.


Next Story

Most Viewed