వారికి కూడా 35 కేజీల బియ్యం అందిస్తాం : కేంద్రం

by  |
వారికి కూడా 35 కేజీల బియ్యం అందిస్తాం : కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్ :
అంత్యోదయ అన్న యోజన పథకానికి సంబంధించి సెంట్రల్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. దీనివలన వికలాంగులకు ల‌బ్ది చేకూర‌నుంది. ఇన్నిరోజులు వికలాంగులకు రేషన్ స్కీమ్ ప్రయోజనాలు అందడం లేద‌నే అంశంపై ఢిల్లీ ఉన్నత న్యాయ‌స్థానం ఇచ్చిన ఆదేశాలను సీరియస్‌గా తీసుకున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన పథకాన్ని 2000 డిసెంబర్ 25న ప్రారంభించింది. దీని ద్వారా అతి త‌క్కువ ధ‌ర‌లకే పేద‌ల‌కు బియ్యం లేదా గోధుమలు అందిస్తోంది. 2003లోనే ఈ ప‌థకాన్ని వికలాంగులకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల ప‌లుచోట్ల వీరికి ప‌థ‌కానికి సంబంధించి ప్ర‌యోజ‌నాలు చేకూరడం లేదని రామ్‌విలాస్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు.

అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు కలిగిన వారికి 35 కేజీల బియ్యం లేదా గోధుమలు రాష్ట్రాలే అందించాల‌ని కేంద్రమంత్రి స్ప‌ష్టంచేశారు. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక సూచ‌న‌లు చేశారు. అంత్యోదయ అన్న యోజన ప‌థ‌కంలో చేరిన వారికి ఒక ప్రత్యేకమైన కార్డును అందజేస్తారు. దీని ద్వారా రేషన్ బియ్యం లేదా గోధుమ‌లు తీసుకోవచ్చు. అర్హులకు కేజీ బియ్యం రూ.3 చొప్పున, గోధుమ‌లు రూ.2 చొప్పున‌ 35 కేజీలు వరకు పొందవచ్చు. అంతేకాకుండా, కేంద్రం మరో విషయాన్ని కూడా స్ప‌ష్టంగా చెప్పింది. గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద రేషన్ కార్డు కలిగిన వారికి ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేయాలని రాష్ట్రాలకు మరోసారి స్పష్టంచేసింది.


Next Story