నిజామాబాద్‌లో విచ్చల విడిగా గంజాయి

by  |
నిజామాబాద్‌లో విచ్చల విడిగా గంజాయి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గంజాయి గుప్పు మంటోంది. కొంతకాలంగా గంజాయి విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. లాక్‌డౌన్ కాలంలో మద్యం అమ్మకాలను నిషేధించిన కాలంలో గంజాయి మాత్రం మార్కెట్‌లో విచ్చల విడిగా అమ్ముతున్నారు. గంజాయి ప్యాకెట్‌కు రూ.100 నుంచి 200కు అమ్ముతున్నారు. నిజామాబాద్‌లోని గంజాయికి నాణ్యతగా ఉండడంతో ఉత్తర భారతానికి ఎగుమతి జరుగుతోంది. కిలోకు రూ.2 వేలకు ఒరిస్సా, మన్యం నుంచి తీసుకొచ్చి ఇక్కడ రూ.8 వేలకు అమ్ముతున్నారు. డిమాండ్‌ను బట్టి దానిని గ్రాములకు, సిగరేట్ ల రూపంలో అమ్మకాలు సాగిస్తున్నారు. కొన్నేండ్లుగా గంజాయి తయారీకి నిజామాబాద్ అడ్డాగా మారింది. కొంతకాలం క్రితం వరకు జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు జోరుగా సాగేది. అబ్కారీ, పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపడంతో గంజాయి వనాలు కనుమరుగయ్యాయి. కాని స్మగ్లర్లు విశాఖ, ఒరిస్సా నుంచి తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు.

తెలంగాణలో తొలి పీడీ యాక్టు..

గంజాయి స్మగ్లర్ పై నిజామాబాద్ జిల్లాలోనే తొలి పీడీయాక్ట్ కేసు నమోదు అయింది. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ‘గంజావాలా’ పై నమోదు అయింది. అప్పటి వరకు వైట్ కాలర్ మాటున దాగిఉన్న వ్యక్తి ఏకంగా ఇంటిపేరునే గంజావాలాగా మార్చుకున్నారు. కానీ తరువాత కాలంలో పోలీస్, ఆబ్కారి శాఖలు గంజాయి స్మగ్లర్‌లతో కలిసి పోయారని విమర్శలు ఉన్నాయి. ఏకంగా అధికారులు, గంజాయి విక్రేతలు కలిసి దందా సాగిస్తున్నట్లు చర్చ సాగుతోంది.

కార్లలో తరలింపు..

మహారాష్ట్రకు సరిహద్దు ఉన్న జిల్లాగా ఉండడంతో గంజాయి స్మగ్లర్లకు నిజామాబాద్ అడ్డాగా మారింది. నిజామాబాద్ నుంచి పొరుగు రాష్ట్రాలకు గంజాయిని రైళ్లను తరలించేవారు. కరోనా కారణంగా రైల్వే నిలిచిపోవడంతో కార్లలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో భీంగల్ మండల శివారులో 20 సంవత్సరాల్లోపు యువకులు కారులో గంజాయిని హైద్రాబాద్‌కు తరలిస్తూ చిక్కడం తెలిసిందే. స్మగ్లింగ్‌కు ఖరీదైన కార్లలోనే విశాఖ, ఒరిస్సా నుంచి నిజామాబాద్‌కు తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. అక్కడి నుంచి సరిహద్దులను దాటించి పోరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఖరీదైన కార్లు కావడంతో ఎవరికీ అనుమానం రాదని, ఫైనాన్స్ సీజింగ్ వాహనాలను గంజాయి రవాణాకు వాడుతున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed