రెవె‘న్యూ’ బిల్లుకు మంత్రివర్గ ఆమోదం..

by  |
రెవె‘న్యూ’ బిల్లుకు మంత్రివర్గ ఆమోదం..
X

దిశ, న్యూస్ బ్యూరో: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సోమవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆ చట్టానికి వీలుగా రూపొందించిన బిల్లును ఆమోదించింది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అనే వ్యవస్థను రద్దు చేస్తూ మరో బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. రెవెన్యూ కొత్త చట్టం ఉనికిలోకి వస్తున్న నేపథ్యంలో పట్టాదారు పాస్‌బుక్ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లు తదితరాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టంపై రెండేళ్లుగా జరుగుతున్నకసరత్తు బిల్లు తయారీకి ఆమోదం లభించడంతో ముగింపు వచ్చినట్లయింది. చట్టానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. వరుసగా రెండు రోజుల పాటు చర్చ కూడా జరగనుంది. ప్రస్తుతానికి రెవెన్యూ మంత్రి లేనందువల్ల ముఖ్యమంత్రే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆవశ్యకతను వివరించనున్నారు. ఏకంగా రెండురోజుల చర్చ జరగనున్నందున బిల్లుపై ముఖ్యమంత్రి లోతైన వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

ఆసక్తికరమైన రెవెన్యూ చట్టంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నాలుగు ఆర్డినెన్సుల స్థానే రూపొందించిన బిల్లులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు 21 రోజుల పాటు జరగనున్నందున ప్రభుత్వం రూపొందించిన నాలుగు ఆర్డినెన్సులు, మరో 8 బిల్లులు, కొన్ని తీర్మానాలు తదితరాలన్నింటిపై విస్తృతంగానే చర్చ జరిగే అవకాశం ఉంది. రెవెన్యూ చట్టంపై అనేక సెక్షన్ల నుంచి విమర్శలు వస్తుండడం, వీఆర్వో వ్యవస్థనే రద్దు చేసినందువల్ల వారి ఉద్యోగాలు ఏమవుతాయోననే ఆందోళన వ్యక్తం కావడం, భూ వివాదాల పరిష్కారానికి కొత్త చట్టం ఏ విధంగా దోహపడుతుందో, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలాంటి సేవలందిస్తుందో తదితరాలన్నింటినీ అసెంబ్లీలో లోతుగానే చర్చ జరిగే అవకాశం ఉంది.

కొత్త చట్టాల రూపకల్పనకు అవసరమైన బిల్లులతో పాటు నూతన సచివాలయ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే ఖర్చులకు సంబంధించి పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం నిర్మించాలనుకున్న సమీకృత జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్సులకు అవసరమయ్యే నిధుల కేటాయింపు కోసం గతంలో ఇచ్చిన పరిపాలనా అనుమతులకు సవరణలు చేస్తూ రూపొందించిన ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్ర బీసీ కమిషన్ 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది.

మంత్రివర్గం ఆమోదించిన బిల్లులు ఇవే..

• ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020
• ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020
• తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లు
• పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్
అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు – 2018 సవరణ బిల్లు
• తెలంగాణ జీఎస్‌టీ యాక్టు -2017 లో సవరణ బిల్లు
• తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020
• ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020
• ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2020
• ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్ బిల్లు
• టీఎస్ బిపాస్ బిల్
• తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లు
• ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు -1972 కు సవరణ బిల్లు
• కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు
సంబంధించిన పరిపాలనా అనుమతులు
• కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం
సవరించిన పరిపాలనా అనుమతులు
• 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులు



Next Story