Budget-2025: హల్వా వేడుకలో పాల్గొన్న నిర్మలా సీతారామన్.. మొదలైన 'లాక్-ఇన్ పీరియడ్'

by S Gopi |
Budget-2025: హల్వా వేడుకలో పాల్గొన్న నిర్మలా సీతారామన్.. మొదలైన లాక్-ఇన్ పీరియడ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వంలో మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఫిబ్రవర్ 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో 2025-26 బడ్జెట్ తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే సాంప్రదాయ హల్వా వేడుక శుక్రవారం నార్త్ బ్లాక్‌లో జరిగింది. ఈ వేడుకకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వారందరికీ నిర్మలా సీతారామన్ హల్వాను స్వయంగా పంచిపెట్టారు. వరుసగా ఎనిమిదోసారి యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్, ఈసారి కూడా డిజిటల్ పద్దతిలోనే బడ్జెట్ సమర్పించనున్నారు. బడ్జెట్ తయారీ 'లాక్-ఇన్' ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతి సంవత్సరం సంప్రదాయ హల్వా వేడుకను నిర్వహిస్తారు. బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే అధికారులు, సిబ్బంది అంతా నార్‌బ్లాక్‌లోనే ఉంటారు. అధికారులందరూ సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ వారందరికీ బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఈ విధానం నార్త్ బ్లాక్‌లో ఉన్న బేస్‌మెంట్ లోపల యూనియన్ బడ్జెట్‌ను ముద్రించడం ప్రారంభించిన 1980 నుంచి కొనసాగుతోంది. ఈసారి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

Next Story

Most Viewed