దళితులకు సీఎం క్షమాపణ చెప్పాలి : కోమటిరెడ్డి

by  |
దళితులకు సీఎం క్షమాపణ చెప్పాలి : కోమటిరెడ్డి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన వేలూరు గ్రామానికి చెందిన నర్సింహులు పురుగుల మందు తాగి మరణించడం అత్యంత బాధాకరమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వెంకటరెడ్డి మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే మోసం చేసిందని గుర్తు చేశారు. దళితులకు ఉన్న భూమిని అన్యాయంగా లాక్కొని వారి ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణమవుతుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణమా.. నర్సింలు మరణానికి బాధ్యులైన అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని, మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. దళిత యువకుడి పైన టిప్పర్ ఎక్కించి హత్య చేశారని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నెరేళ్లలో గతంలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బడుగు, బలహీన వర్గాల పైన థర్డ్ డిగ్రీని ఈ ప్రభుత్వం ప్రయోగించిందన్నారు. సీఎం కేసీఆర్ సర్కార్ దళితులను బలి తీసుకుంటుందని, వరుసగా దళితులపైన జరుగుతున్న దాడులు నన్ను తీవ్రంగా కలిచివేస్తున్నాయని తెలిపారు. నర్సింహులు కుటుంబాన్ని కేసీఆర్ వెంటనే పరామర్శించాలని, కేసీఆర్ దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నర్సింహులు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వరమే ఆదుకోవాలని, మూడెకరాల భూమిని, రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న దళితులు, బడుగు, బలహీన వర్గాలు ఎవరూ ఆధైర్యపడొద్దని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.


Next Story

Most Viewed