ఎలా ప్రారంభిద్దాం?

by  |
ఎలా ప్రారంభిద్దాం?
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ స్తంభించిపోయింది. ఈ క్రమంలో మొదటిసారిగా బయో సెక్యూర్ వేదికల్లో ఇంగ్లండ్, విండీస్ జట్లు తొలిటెస్టు ఆడనున్నాయి. అయితే, ఈ దిశగా ఇంతవరకు బీసీసీఐ మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. టీమ్‌ఇండియా తిరిగి ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడనున్నది, ఆటగాళ్లకు శిక్షణా కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే సమాచారం ఇంతవరకు తెలుపలేదు. భారత క్రికెట్ భవిష్యత్, ఇతర ముఖ్యమైన అంశాలను చర్చించడానికి ఈనెల 17న అత్యున్నత కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు బీసీసీఐలో ప్రభుత్వ నామినీ అల్కా భరద్వాజ్ చెప్పారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రతినిధిగా ఆమె ఈ సమావేశం నిర్వహించనున్నారు.

జై షాకు అనుమతి నిరాకరణ

కాగ్ ఆధ్వర్యంలో జరుగనున్న బీసీసీఐ అత్యున్నత కమిటీ సమావేశానికి మాజీ కార్యదర్శి జై షాకు అనుమతి నిరాకరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయనకు తెలిపారు. కొత్త రాజ్యాంగం, లోథా కమిటీ సంస్కరణల ప్రకారం గత వారమే జై షా కార్యదర్శి పదవికి అనర్హుడయ్యారు. క్రికెట్ పరిపాలక పదవిలో అతను వరుసగా ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో మూడేళ్ల కూలింగ్ పిరియడ్ ముగిసే వరకు బీసీసీఐలో మరే పదవి చేపట్టే అవకాశం లేదు. ఈ నెల 27తో సౌరవ్ గంగూలీ కూడా పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ లోపే క్రికెట్ భవిష్యత్‌పై చర్చ జరగాలనే ఉద్దేశంతో ఈనెల 17న అత్యున్నత సమావేశం నిర్వహించినట్లు తెలుస్తున్నది. వీరిద్దరి పదవులను మరో నాలుగేళ్లపాటు కొనసాగించమని ఇప్పటికే సుప్రీంకోర్టును బీసీసీఐ ఆశ్రయించింది. కానీ, ఈ విషయమై ఇంకా నిర్ణయం వెలువడలేదు.

సమావేశం అజెండా..

ఈనెల 17న నిర్వహించనున్న బీసీసీఐ అత్యున్నత కమిటీ సమావేశం కోసం 11 పాయింట్ల అజెండా రూపొందించారు. ఇందులో ఈ ఏడాది ఐపీఎల్ ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలనేదే ముఖ్యమైన అంశం. దీంతోపాటు దేశవాళీ క్రికెట్ కొత్త సీజన్ ప్రణాళిక, టీమ్‌ఇండియా భవిష్యత్ పర్యటనలు, ఈశాన్య రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల చెల్లింపులు, 2021లో టీ20 వరల్డ్ కప్‌ నిర్వహణకు సంబంధించిన పన్ను సంబంధింత విషయాలు, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అడాడమీలో సౌకర్యల మెరుగు పర్చడం, బీసీసీఐ కార్యాలయంలో కొత్త సిబ్బంది నియామకం, బీసీసీఐ డిజిటల్ సేవల పొడిగింపు తదితర విషయాలు చర్చకు రానున్నాయి. వీటన్నింటి కంటే ముందు అల్కా భరద్వాజ్ ఏర్పాటు చేసే మరో సమావేశంలో అత్యున్నత కమిటీ సమావేశానికి హాజరు కావడానికి ఎవరెవరు అర్హులనే విషయాలను చర్చించనున్నారు.


Next Story