హైదరాబాద్‌లో రూ.45 వేలకు శిశువు విక్రయం

by  |
హైదరాబాద్‌లో రూ.45 వేలకు శిశువు విక్రయం
X

దిశ, క్రైమ్​ బ్యూరో: రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్​ లో శిశువును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తల్లి బిడ్డను విక్రయించగా, కొనుగోలు చేసిన వారు సైతం మరొకరికి విక్రయించం నగరంలో సంచలనంగా మారింది. హబీబ్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.

నాంపల్లి సుభాన్​పురాకు చెందిన అబ్దుల్​ ముజాహిద్​ (29) బార్​ అండ్​ రెస్టారెంట్​ లో మేనేజర్​ గా పనిచేస్తాడు. ఈయనకు ఏడాదిన్నర క్రితం అబ్దుల్​ జోయాఖాన్​ ను ప్రేమ వివాహాం చేసుకున్నాడు. వీరికి షేక్​ అద్నాన్​ అనే 2 నెలల బాలుడు ఉన్నాడు. గత రెండు నెలలుగా నాంపల్లి సుభాన్​ పురాలో అద్దెకు నివాసిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన అబ్దుల్​ ముజాహిద్​ భార్యతో గొడవ పడి ఎంఎస్​ మక్తాలోని సొంతింటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటి నుంచి వెళ్ళే సమయంలో అతని కొడుకు భార్యతో పాటే ఉన్నాడు. అనంతరం ఈ నెల 8న సాయంత్రం 6:30 గంటలకు నాంపల్లి సుభాన్​పురాలోని అద్దె ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో కుమారుడు కన్పించకపోయే సరికి భార్యను అడుగగా.. అఘాపురాకు చెందిన షేక్ మహమ్మద్, తబుస్సం బేగం దంపతులకు రూ.45 వేలకు అమ్మినట్లు తెలిపింది. దీంతో భర్త ముజాహిద్​ ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు.

వెంటనే మొబైల్​ ఫోన్​ ద్వారా అఘాపురాకు చెందిన షేక్​ మహమ్మద్​ను సంప్రదించగా, కుమారుడిని అప్పగిస్తామని చెప్పారు. కానీ, అతను అఘాపురాకు వెళ్లాకా.. కాలాపత్తర్​ కు చెందిన మరో వ్యక్తికి అమ్మినట్టు చెప్పారు. దీంతో ముజాహిద్​ తన కుమారుడి విక్రయం గురించి హబీబ్​ నగర్​ పోలీస్​స్టేషన్​ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్​ఐ బి.జయంత్​ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి, శిశువును కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకుని, బాబును తండ్రికి అప్పగించారు.



Next Story