మీ ఖర్చెంత… లెక్కలేంది..?

by  |
మీ ఖర్చెంత… లెక్కలేంది..?
X

దిశ, న్యూస్‌బ్యూరో: గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై కేంద్రం కన్నేసింది. ఆర్థికసంఘం నిధులను విడుదల చేస్తున్నా గ్రామాల్లో సమగ్ర పాలన సాగడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో పంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్ చేయాలని ఆదేశాలిచ్చింది. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాకుండా పంచాయతీ నిధుల వినియోగంపై ఆడిట్ పూర్తి చేసి ధృవీకరణ పత్రాలు ఇస్తేనే 15వ ఆర్థికసంఘం నిధులు విడుదల చేస్తామంటూ ఆంక్షలు విధించింది. దీంతో పంచాయతీల్లో ఆడిట్ చేయడం అనివార్యమైంది. ఇప్పటికే నిధుల వినియోగంలో పంచాయతీల్లో సవాలక్ష సమస్యలు నెలకొన్నాయి. ప్రభుత్వం నిధులు సరిగా పెంచకున్నా… పంచాయతీల్లో పని చేసే కార్మికుల వేతనాలు పెంచడం, విద్యుత్ బిల్లులు ఇక నుంచి ప్రతినెలా చెల్లించాలని ఆదేశాలివ్వడం, ట్రాక్టర్ల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలతో నిధులన్నీ నీళ్లలా ఖర్చు అవుతున్నాయి. అయితే గతంలో పంచాయతీల్లో వినియోగించిన నిధులకు యూసీలు ( యుటిలైజేషన్ సర్టిఫికెట్స్) సమర్పిస్తే వాటినే పరిగణలోకి తీసుకుని నిధులు విడుదల చేసేవారు. కానీ ఇక నుంచి కేంద్రం ఆన్‌లైన్ ఆడిట్ తప్పనిసరి చేసింది. అంటే పంచాయతీల్లో వెచ్చించిన ప్రతి రూపాయికి ఎంఆర్‌పీ ధరలను అనుసరిస్తూ వాటికి సంబంధించిన రసీదులన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. అలా చెల్లించిన ఆన్‌లైన్ ఆడిట్‌లో ధృవీకరించిన తర్వాతే వాటిని పరిగణలోకి తీసుకుంటారు.

పంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్ సోమవారం నుంచి మొదలుకానుంది. దీనిపై కేంద్ర ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 3నుంచి ఆన్‌లైన్ ఆడిట్ చేయాలని స్పష్టం చేసింది. 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదలకు ఆన్‌లైన్ ఆడిట్ తప్పనిసరిగా చేయడంతో ప్రతిపైసా లెక్కించాలని సూచించారు. 542 మండలాల్లోని 12,769 గ్రామ పంచాయితీల్లో ముందుగా 3,830 (30 శాతం) గ్రామ పంచాయితీల్లో ఆన్‌లైన్ ఆడిట్ ప్రారంభం అవుతోంది. గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఆడిటర్లకు సంయుక్తంగా పంచాయతీరాజ్, ఆడిట్ శాఖ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆన్‌లైన్ ఆడిట్ ప్రక్రియపై గ్రామ పంచాయితీల కార్యదర్శులకు ఆన్‌లైన్ ఆడిట్ వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని పంపించారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా కనీసం 20శాతం గ్రామపంచాయితీల ఆడిట్ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని, వాటి ప్రకారమే పంచాయతీలకు నిర్దేశించిన 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో పంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్ కోసం 350 మంది ఆడిట్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలను పూర్తిచేశారు. 3830 గ్రామ పంచాయితీల్లో 336మంది ఆడిటర్లతో అక్టోబర్ 31 వరకు నిర్వహించనున్నారు.

నిధుల సంక్షోభం

మరోవైపు గ్రామ పంచాయతీల్లో నిధుల సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం వస్తున్న నిధులన్నీ పంచాయతీల నిర్వహణకే సరిపోవడం లేదు. ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ ఉండాలని, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను రూ. 8,500ల చొప్పున పెంచడం, మల్టీపర్పస్ కార్మికులుగా గుర్తించి వారికి వేతనాలు ఇవ్వాల్సి వస్తున్న నేపథ్యంలో వచ్చిన నిధులు వీటికే సరిపోతున్నాయి. దీంతో కనీసం బ్లీచింగ్ ఫౌడర్ కొందామంటే కూడా చిల్లిగవ్వ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో చాలా పంచాయతీల్లో గ్రామానికి సంబంధించిన పనులేమీ జరగడం లేదు.


Next Story

Most Viewed