ఏపీలో రేపటి నుంచి రైట్.. రైట్

by srinivas |
ఏపీలో రేపటి నుంచి రైట్.. రైట్
X

దిశ ఏపీ బ్యూరో: ఏపీ వ్యాప్తంగా బస్టాండ్లు ప్రయాణికులతో కళకళలాడనున్నాయి. రెండు నెలల నుంచి వినబడని రైట్.. రైట్ అనే శబ్దం ఇక బస్టాండ్‌లలో మారుమోగనుంది. కరోనా కారణంగా గత రెండు నెలల నుంచి బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో గురువారం నుంచి ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు రవాణా శాఖాధికారులు చెబుతున్నారు. టికెట్ రేట్లపై మాత్రం మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం నుంచే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాల్సి ఉంది. అయితే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం కొలిక్కి రావడం లేదు. ఆస్పత్రుల నుంచి కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నప్పటికీ.. అదే స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో కరోనా తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదని భావించిన రవాణాశాఖాధికారులు ప్రజా రవాణా ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు మంగళవారం నుంచే తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.

దీంతో ఏపీలో కూడా ఆర్టీసీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత అంత రాష్ట్ర ప్రధాన నగరాల మధ్య బస్సులను నడపాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేసింది. తొలుత రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల మధ్య ఒక బస్టాండ్ నుంచి మరో బస్టాండ్ వరకు మాత్రమే బస్సులు నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సిటీ బస్సులను మాత్రం నడపడం లేదు. బస్సుల్లో టికెట్లు ఇవ్వరు. బస్టాండ్‌లోనే టికెట్ కొనుగోలు చేసిన తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. అక్కడ ఒకే అయితేనే ప్రయాణికుడి పూర్తి వివరాలు సేకరించి, బస్సు ఎక్కేందుకు అనుమతిస్తారు.

అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించేందుకు సమయం ఉన్నప్పటికీ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వరకు మాత్రమే బస్సులు నడపనున్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి, స్పందన పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నారు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల నుంచి వచ్చిన వారికి వైరాలజీ పరీక్షలు నిర్వహించిన తరువాతేనే ఇళ్లకు పంపనున్నారు. ఇక బస్సుల్లో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అవకాశం ఇచ్చారు. దీంతో నష్టాలు భర్తీ చేసుకునేందుకు ఛార్జీలు పెంచాలని అధికారులు సూచనలిచ్చినప్పటికీ సీఎం అంగీకరించనట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed