ట్విట్టర్ హ్యాక్: మొదటి ట్వీటే మోసం!

by  |
ట్విట్టర్ హ్యాక్: మొదటి ట్వీటే మోసం!
X

బిట్‌కాయిన్ స్కామ్‌ పేరుతో ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్ భారీ హ్యాక్‌కు గురైంది. ఇందులో భాగంగా బిట్‌కాయిన్ సంస్థల ఖాతాలతో పాటు వ్యాపార దిగ్గజాలు, ప్రముఖ కంపెనీల అధికారిక ఖాతాలు కూడా హ్యాక్‌కు గురయ్యాయి. హ్యాక్‌కు గురైన మిగతా ఖాతాలతో పోలిస్తే ఆపిల్ సంస్థ ఖాతా పరిస్థితి ప్రత్యేకం. ఎందుకంటే ఆపిల్ సంస్థ ఇప్పటివరకు ఒక్క పబ్లిక్ ట్వీట్ కూడా చేయలేదు. కానీ ఈ హ్యాక్‌లో భాగంగా మొదటి పబ్లిక్ ట్వీట్ ఒక స్కామ్ ట్వీట్ కావడం ఇప్పుడు అందరికి నవ్వు తెప్పిస్తోంది. సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తూ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే ఆపిల్ లాంటి సంస్థ.. తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో మొదటి పబ్లిక్ ట్వీట్ ‘బిట్ కాయిన్ స్కామ్’ అవడమే ఇందుకు కారణం.

2016లో ఆపిల్ అధికారిక ట్విట్టర్ ఖాతా తెరిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషనల్ ట్వీట్లు తప్ప, తమ ఖాతాలో అధికారికంగా ఎలాంటి పబ్లిక్ ట్వీట్లు చేయలేదు. కానీ ఈ బిట్‌కాయిన్ హ్యాక్ కారణంగా ఆపిల్ ఖాతాలో ఒక పబ్లిక్ ట్వీట్ వచ్చిపడింది. అయితే ఈ ట్వీట్‌ను సంస్థ డిలీట్ చేసినప్పటికీ చూడాల్సిన వాళ్లందరూ చూసేశారు. ఈ హ్యాక్‌లో ఆపిల్‌తో పాటు ఇలాన్ మస్క్, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారు. అయితే ఈ హ్యాక్‌కు సంబంధించి విచారణ చేస్తున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది.


Next Story