ఇకపై ఆన్లైన్ జూదం ఆడితే అంతే సంగతులు…

by  |
ఇకపై ఆన్లైన్ జూదం ఆడితే అంతే సంగతులు…
X

దిశ వెబ్ డెస్క్: ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌ను నిషేదించేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. ఈ మేరకు వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాబినేట్ సమావేశం జరిగింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను నిషేదించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ…ఆన్ లైన్ జూదంతో యువత పెడతోవ పట్టి జీవితాలను నాశనం చేసుకుంటోందన్నారు. యువతను కాపాడేందుకు ఆన్ లైన్ జూదాన్ని నిషేదించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇకపై ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నేరమన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించనున్నట్టు తెలిపారు. మొదటి సారి ఈ నేరానికి పాల్పడే గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు ఏడాది జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించనున్నట్టు తెలిపారు. రెండో సారి ఇదే నేరానికి పాల్పడితే రెండేండ్ల జైలు శిక్షతో పాటుగా భారీగా జరిమానా విధించాలని నిర్ణయించామన్నారు. ఇక ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడే వారికి ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించనున్నట్టు చెప్పారు.



Next Story