రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నా.. YCP నేత విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-25 14:22:15.0  )
రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నా.. YCP నేత విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి(YCP MP Vijayasai Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం ఉదయం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం అని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలో చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

‘‘రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తేదీన రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీలో చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బు ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని. జగన్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా.

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. కానీ చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకి, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’’ అని విజయసాయి రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు.



Next Story