తగ్గేదేలే అంటున్న టీడీపీ : రేపు కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపు

by Seetharam |
తగ్గేదేలే అంటున్న టీడీపీ : రేపు కాంతితో క్రాంతి కార్యక్రమానికి   పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పటి నుంచి టీడీపీ పోరాటానికి దిగింది. బాబుతో నేను పేరుతో తెలుగు రాష్ట్రలతోపాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా టీడీపీ అభిమానులు నిరసనలకు దిగారు. మరోపు మోత మోగిద్దాం అనే వినూత్న కార్యక్రమాన్ని సైతం టీడీపీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణుల నుంచి అనూహ్య స్పందన లభించింది. అనంతరం అక్టోబర్ 2న చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ సత్యమేవ జయతే దీక్షలు చేపట్టింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ దీక్షలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో నారా లోకేశ్‌లు సత్చమేవ జయతే పేరుతో దీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ మరో నిరసనకు పిలుపు నిచ్చింది. ఈనెల 7 అనగా శనివారం కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఇళ్లల్లో లైట్లు ఆఫ్ చేసి చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపాలని టీడీపీ ప్రకటించింది.


చంద్రుడిని చీకటిలో బంధించారు : లోకేశ్

ప్రగతి వెలుగులు పంచే చంద్రుడిని చీటిలో బంధించారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాజమహేంద్రవరం క్యాంపు కార్యాలయంలో కేశ్ మాట్లాడారు. గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం అంటూ శనివారం వినూత్న నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05గంటటల వరకు ఇళ్లలో లైట్లు ఆర్పి, ఇంటి బయట సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి 5 నిమిషాల పాటు నిరసన తెలపాలని కోరారు. అలాగే రోడ్డుపై వాహనాల్లో ఉంటే వాహన లైట్లు బ్లింక్ కొట్టాలని కోరారు. శాంతియుతంగా జరగబోయే ఈ నిరసన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా భారత కాలమానం ప్రకారం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

మనమెందుకు చీకట్లో ఉండాలి?: నారా బ్రాహ్మణి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని...కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని నారా బ్రహ్మణి అన్నారు. టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చిన ‘కాంతితో క్రాంతి’ నిరసన కార్యక్రమంపై ట్విటర్ వేదికగా బ్రాహ్మణి స్పందించారు.‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి?. అక్టోబర్‌ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌, కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్‌ చేద్దాం’ అని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు.

అన్యాయం...అధర్మం చీకటికి సంకేతాలు: భువనేశ్వరి

అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలో ఉన్న చీకటిని తెలియజేస్తోందని అభిప్రాయపడ్డారు. ఆ చీకటిని తరిమికొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి అని అభిప్రాయపడ్డారు. ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి దీపాలను వెలిగిద్దామని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని కోరారు. అనంతరం ‘బాబుతో నేను’ అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని భువనేశ్వరి కోరారు.

Advertisement

Next Story