సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అసలు కారణం అదేనా?

by Hamsa |
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అసలు కారణం అదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రకాశం జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్యకేసును పోలీసులు చేధించారు. అప్పు తీరుస్తామని పిలిచి టెకీని స్నేహితుడు దారుణంగా హత్య చేశాడు. ఆమెపై కిరాతకంగా కారు ఎక్కించి, బండ రాళ్లతో మోది పాశవికంగా హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండలంలోని జిల్లెళ్లపాడుకు చెందిన మేడం సుధాకర్‌రెడ్డి, సుబ్బలక్ష్మమ్మ కూతురు రాధ(35). తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మోహన్ రెడ్డికి ఇచ్చి కొన్నేళ్లక్రితం పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం.

మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండటంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయితే ఈ నెల 11న రాధ చౌడేశ్వరిదేవీ పూజల నిమిత్తం తన పుట్టింటికి కుమారుడుతో కలిసి వచ్చారు. అయితే గతంలో తీసుకున్న అప్పు చెల్లిస్తామని కనిగిరి రావాలని ఫోన్ రావడంతో అతడి మాటలు నమ్మి ఆమె వెళ్లింది. చిన్న కుమారుడిని కనిగిరిలో నివసించే బాబాయి నాగిరెడ్డి ఇంటి దగ్గర వదిలి అక్కడ నుంచి ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన అడ్రస్‌కు వెళ్లింది. అయితే రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆందోళనతో బాబాయి నాగిరెడ్డి తన సోదరుడు సుధాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఇరువురు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి కనిగిరి రహదారి పక్కన అత్యంత దయనీయ స్థితిలో విగతజీవిగా రాధా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. రాధ అనుమానాస్పద మృతితో కుటుంబంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.

హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా?

రాధ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. రాధ స్నేహితుడు అయిన కేతిరెడ్డి కాశిరెడ్డి అలియాస్‌ చినకాశయ్య ఈఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాశిరెడ్డి, రాధ చిన్ననాటిస్నేహితులు. రాధ దంపతుల కంటే ముందే కాశిరెడ్డి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రాధ, మోహన్ రెడ్డి దంపతులు కూడా హైదరాబాద్‌లో స్థిరపడటంతో కాశిరెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్‌గా మసిలేవాడు. అయితే అకస్మాత్తుగా కాశిరెడ్డిని ఆయన పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తనకొక ప్రాజెక్టు ఆలోచన ఉందని.. అందుకు డబ్బు అవసరమని రాధ, మోహన్‌రెడ్డి దంపతులను నమ్మించాడు. దీంతో మోహన్ రెడ్డి, రాధ దంపతులు రూ.80 లక్షల వరకు అతనికి అప్పుగా ఇచ్చారు. అప్పు తీసుకున్న కాశిరెడ్డి నగదు తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారు. రాధ, ఆమె భర్త కలిసి కాశిరెడ్డిని పలుమార్లు కలిసి డబ్బులు తిరిగి ఇవ్వాలని బతిమిలాడిననా ఫలితం లేకుండా పోయింది. అయితే చౌడేశ్వరీ దేవి ఉత్సవంలో పాల్గొనడానికి తమ పిల్లలతో స్వగ్రామమైన జిల్లెళ్లపాడుకు రాధ వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న కాశిరెడ్డి ఆమెకు ఫోన్ చేసి తాను చెప్పిన చోటికి వస్తే కొంత నగదు ఇస్తానని నమ్మబలికాడు. అది నిజమని నమ్మిన కాశిరెడ్డి చిన్న కుమారుడితో కలిసి కనిగిరి వెళ్లింది. కుమారుడిని బాబాయ్ నాగిరెడ్డి ఇంటి వద్ద వదిలిపెట్టి అతడి కనిగిరి వెళ్లింది. చీకటి పడటంతో బాబాయి నాగిరెడ్డి ఫోన్ చేయగా తాను వస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మళ్లీ కాల్ చేయగా ఆమె స్పందించలేదు. దీంతో బాబాయ్ నాగిరెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డికి ఫోన్ చేసి జరిగినది తెలియజేశాడు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి ఆరా తీశారు. రాత్రి 11.30గంటలు అయినా సమాచారం లేకపోవడంతో కనిగిరి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె ఫోన్ ట్రాకింగ్ చేయగా జిల్లెళ్లపాడు సమీపంలో ఉందని తేలడంతో గాలించారు. అర్ధరాత్రి సుమారు 1.30 గంటల సమయంలో ఒక మృతదేహాన్ని రోడ్డు పక్కన గుర్తించారు. ఆ తర్వాత ఆమెను రాధగా పోలీసులు, కుటుంబ సభ్యులు గుర్తించారు.

నమ్మించి ప్రాణం తీశారు

రాధను అత్యంత దారుణంగా హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కాళ్ల పైనా, గుండెలపైనా కారుతో తొక్కించి అత్యంత ఘోరంగా హింసించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు శరీరంపై రాళ్లతో తీవ్రంగా దాడి చేశారు. బండరాళ్లతో మోది, సిగరెట్లతో కాల్చి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్యలో ముగ్గురు నలుగురు పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేతిరెడ్డి కాశిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదనపున శిక్షణ ఎస్పీ శ్రీధర్‌, డీఎస్పీ రామరాజు, సీఐ కె.శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు నుంచి డాగ్‌ స్వ్కాడ్‌ను రప్పించారు. పోలీసు జాగిలం రాధ మృతదేహం పడి ఉన్న చోటు నుంచి కనిగిరి వైపు వెళ్లడాన్ని గుర్తించారు. నిందితుడు కాశిరెడ్డి కోసం బెంగళూరు తదితర ప్రాంతాలకు బృందాలను పంపించారు. అంతేకాదు కనిగిరి నుంచి బెంగళూరు వరకు ఉన్న చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు చేపట్టారు.



Next Story