పింఛన్ల పంపిణీ విధానంపై చంద్రబాబు సర్కార్‌ సంచలన నిర్ణయం

by Kavitha |   ( Updated:2024-09-05 05:29:47.0  )
పింఛన్ల పంపిణీ విధానంపై చంద్రబాబు సర్కార్‌ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు గవర్నమెంట్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా రాష్ట్రవ్యాప్తంగా అందిస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానాలు అందిరిలోనూ ఉన్నాయి. ఇకపై అటువంటి వాటికి ఆస్కారం లేకుండా చేయాలని చంద్రన్న సర్కార్ నడుంబిగించింది. పింఛన్ల పంపిణీలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునికి ఎల్‌ ఆర్‌డీ (రిజిస్టర్డ్‌) ఫింగర్‌ప్రింట్‌ స్కానర్లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.53 కోట్లను గ్రామ, వార్డు సచివాలయ శాఖకు కేటాయించింది.

1.34 లక్షల కొత్త స్కానర్లతో అక్టోబర్‌ నుంచి పింఛన్లు పంపిణీ చేయనుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఎల్‌వో ఆర్‌డీ డివైజ్‌లలో సెక్యూరిటీ తక్కువగా ఉండటంతో నకిలీ వేలి ముద్రలతో పింఛన్లు స్వాహా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ ద్వారా డివైజ్‌ల కొనుగోలుకు రాష్ట్ర సచివాలయాల శాఖ టెండర్లు ఆహ్వానించింది.

అంతే కాకుండా రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్‌ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ ఓపెన్‌ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తుతో పాటు పెన్షన్‌ ఐడీ, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, సచివాలయం పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్‌ జిరాక్స్‌ కూడా అందించాలి. దీంతో స్వగ్రామాలకు రాలేనివారు తాము ఉండే ప్రాంతాల్లోనే పెన్షన్‌ తీసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed