ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు.. అధికారులకు ఏపీ వ్యవసాయమంత్రి ఆదేశాలు

by Geesa Chandu |
ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు.. అధికారులకు ఏపీ వ్యవసాయమంత్రి ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ జిల్లాలోని ఏ ఒక్క రైతుకు ఆదాయం తగ్గకుండా.. తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రాయలసీమ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి వ్యవసాయ భూముల సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా.. రైతులందరికీ మేలు చేకూర్చడంతో పాటు, వారికి 80 శాతం రాయితీపై విత్తనాలను అందించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు మంత్రి. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో.. రాయలసీమలోని 8 జిల్లాల వ్యవసాయ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పంటలకు, వ్యవసాయానికి అవసరమైన రైతులు కోరుకునే విత్తనాలను సిద్ధం చేయడంతో పాటు, అలాంటి విత్తనాలకు రాయితీని కూడా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగుకు దూరంగా ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అయితే ప్రత్యామ్నాయ పంటల వాస్తవ అంచనాలను రూపొందించాలని, రైతులకు సాధారణ సాగులో ఆదాయం తగ్గకుండా ప్రత్యామ్నాయ పంటలను సూచించాలని తెలిపారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీ రావు మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాలో 15,03,613 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి గానూ, ఇప్పటివరకు 11,24,351 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయని తెలిపారు. అయితే, 3,79,262 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న భూమిలో ఎలాంటి పంటలు సాగు చేయకపోవటంతో.. ఆ సాగు భూములు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అందుకే వాటి స్థానములో ప్రత్యామ్నాయంగా 2,22,349 హెక్టార్ల అత్యధిక విస్తీర్ణంలో ఉలువలను, మిగిలిన విస్తీర్ణంలో అలసందలు, కొర్రలు, పెసర, జొన్న, మినుములు, సజ్జ పంటలను సిఫారసు చేశారని వెల్లడించారు. వీటిపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు 80 శాతం విత్తన రాయితీ ప్రతిపాదనలపై టెండర్ల ప్రక్రియ చివరి దశలో ఉన్నదని, రానున్న రెండు రోజుల్లో సరఫరా ఏజెన్సీలను నియమించి విత్తన పంపిణీ చేస్తామని, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ శివప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed