టూరిస్టు స్టేషన్లతో నిరంతర నిఘా.. నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

by Javid Pasha |
టూరిస్టు స్టేషన్లతో నిరంతర నిఘా.. నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి
X

దిశ, కర్నూలు ప్రతినిధి : ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చే భక్తులకు గట్టి భద్రత కల్పించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ముందడుగు వేసిందని, టూరిస్టు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేసిందని నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని అహోబిలం, మహానందిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ టూరిస్టు పోలీసు స్టేషన్లను ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి గూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శ్రీశైలం పర్యాటక ప్రదేశంలో త్వరలో ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలలో ప్రతిరోజు భక్తులు, పర్యాటకులు సందర్శిస్తుంటారన్నారు.

వారాంతంలో ఎక్కువ మంది సందర్శణకు వస్తుంటారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు గానూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, సందర్శకులు, ప్రజల రక్షణకు మార్గ నిర్దేశం చేస్తాయన్నారు. ఏపీలో టూరిస్ట్ పోలీసు విధానం ద్వారా ఈవ్ టీజింగ్ ను అరికట్టడం, దొంగతనాలు జరగకుండా చూడడం, జరిగిన వెంటనే ఘటనపై తగిన విధంగా ఫిర్యాదు చేసే ఏర్పాటు చేయడం వంటివి చేశామన్నారు.

దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు, భద్రత కల్పించనున్నట్లు తెలియజేశారు. అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట, నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. దేవాదాయ శాఖను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ టూరిస్టు పోలీసు స్టేషన్లు ఉపయోగపడతాయన్నారు. ఈ స్టేషన్లలో ఒక ఏఎస్ఐ, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఉండి 24 గంటలు పని చేస్తారన్నారు. 24 గంటలు నిరంతరం నిఘా ఉండేలా ఏర్పాటు చేయడం హర్షించదగ్గవిషయమని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Next Story

Most Viewed