Russia-Ukraine: ఉక్రెయిన్‌తో చర్చలకు ఒకే అన్న పుతిన్.. మధ్యవర్తులుగా భారత్, చైనా, బ్రెజిల్

గత కొన్నేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

Update: 2024-09-05 09:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గత కొన్నేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రెండు వర్గాల మధ్య చర్చలకు భారతదేశం, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించవచ్చని ఆయన అన్నారు. రష్యాలోని వ్లాడివోస్టాక్ నగరంలో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్‌లో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌తో శాంతి చర్చలను తాము ఎప్పుడు నిరాకరించలేదు. అయితే ఇస్తాంబుల్‌ ఒప్పందం ఆధారంగా జరగాలని అన్నారు.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత రష్యా అధ్యక్షుడి నుంచి శాంతి చర్చలకు అనుకూలంగా ఉన్నట్లు ప్రకటన వెలువడటం గమనార్హం. గతంలో చర్చల ఆలోచనకు సిద్ధంగా లేని పుతిన్ ఇప్పుడు యుద్ధానికి ముగింపు పలుకుతానని పేర్కొనడంతో ప్రపంచ దేశాల నాయకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ వేలాది మంది సైనికులతో దాడి చేసి దానిని స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా చర్చల ఆలోచనను తిరస్కరించిన పుతిన్ తాజాగా ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలపడం గమనార్హం.


Similar News