Gun Fire:అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. స్కూల్ లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు..!

అమెరికా(America)లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది.

Update: 2024-09-04 19:36 GMT

దిశ, వెబ్‌డెస్క్:అమెరికా(America)లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మరోసారి పాఠశాలలో కాల్పులు కలకలం రేపాయి. జార్జియా(Georgia) రాజధాని అట్లాంటా(Atlanta)కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నబారో కౌంటీలోని అపాలాచీ హైస్కూల్(Apalachee High School)లో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగా దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారని సమాచారం.ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కాల్పులు జరిగిన ప్రదేశం నుండి విద్యార్థులను ఖాళీ చేయించారు. అలాగే చాలా మంది విద్యార్థులను పాఠశాల సమీపంలోని ఓ అథ్లెటిక్ స్టేడియానికి తరలించారు.అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 10:30 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుందని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు బారో కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ నేపథ్యంలో అపాలాచీ పాఠశాల ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పాఠశాల ప్రాంతం మొత్తం పోలీసుల అదుపులో ఉందని, విద్యార్థులను చూడటానికి ఎవరు కూడా స్కూల్ వైపు రావొద్దని తెలిపారు.బుధవారం మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో బారో కౌంటీ షెరీఫ్ జడ్ స్మిత్ మాట్లాడుతూ..నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని , జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.ఈ ఘటన పట్ల అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.


Similar News