టెన్నిస్ దిగ్గజాలకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్త కష్టాలను తీసుకురానుందా..?
కీవ్ : ప్రపంచ టెన్నిస్ దిగ్గజాలకు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొత్త కష్టాలను తీసుకురానుందా అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించడంతో ఆ దేశ క్రీడాకారుల భవిష్యత్ అంధకారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాటో కూటమిలో చేరకూడదనే కారణంతో పుతిన్ ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించాడు. గత నాలుగు రోజులుగా యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ దాడిలో వేలాది మంది రష్యన్, ఉక్రెయిన్ సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ పై రష్యా దాడిని అటు యూఎన్వోలో ప్రపంచదేశాలు ఎండగడుతున్నాయి. యుద్ధం వద్దు శాంతి ముద్దు అని సోషల్ మీడియా వేదికగా ప్రపంచం డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన టెన్నిస్ ఫెడరేషన్తో పాటు రష్యన్, బెలారస్ టెన్నిస్ ఆటగాళ్లను ఏ టోర్నీలోనూ ఆడకుండా బహిష్కరించాలని ఉక్రెయిన్ టెన్నిస్ ఫెడరేషన్ అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్)కు సోమవారం లేఖ రాసింది. తమ దేశంపై జరుగుతున్న దాడులను పరిగణలోకి తీసుకుని ఈ రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లను యూరప్ ప్రో టెన్నిస్, డేవిస్ కప్ లో ఆడకుండా చూడాలని.. రష్యా సొంత టోర్నీ ఫిఫాను నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది.
ఉక్రెయిన్ ఫెడరేషన్ చేసిన వినతిని ఐటీఎఫ్ గనుక అనుమతిస్తే రష్యాకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు తమ కెరీర్ను కోల్పోవాల్సి వస్తుంది. రష్యాకు చెందిన డానియెల్ మెద్వేదెవ్ ప్రస్తుతం ఏటీపీ టోర్నీ వరల్డ్ నంబర్ వన్గా కొనసాగుతుండగా ఆండ్రీ రుబ్లేవ్ వరల్డ్ నంబర్ 6గా కొనసాగుతున్నారు. అయితే, వీరిద్దరూ కూడా యుద్ధం ఆపి శాంతి చాటాలని కోరారు. ఐటీఎఫ్ నిజంగానే వీరిని టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొనకుండా బహిష్కరిస్తే వీరి కెరీర్ వృథా అవుతుంది. వీరితో పాటే కరెన్ ఖచనోవ్, అస్లాన్ కరాట్సేవ్, అనస్తాసియా పావ్లియుచెంకోవా, వెరోనికా కుడెర్మెటోవా, డారియా కసత్కినా, లుడ్మిల్లా సామ్సోనోవా వంటి ఇటాప్ రష్యన్ ఆటగాళ్లు కూడా నష్టపోవాల్సి వస్తుంది. కాగా, ఉక్రెయిన్ చేసిన వినతి పై ఐటీఎఫ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.