RTC ఉద్యోగులకు భారీ షాక్.. పెన్షన్ సొమ్ముకూ సంస్థ ఎసరు​

ఆర్టీసీ రెక్కలు కత్తిరిస్తున్నారు. ఒక్కొక్కటిగా ఏరిపారేస్తున్నారు. ఇప్పటికే కార్మికుల నుంచి వీఆర్ఎస్​ కోసం ఒప్పందాలు చేసుకోవడం

Update: 2022-04-02 01:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : RTC రెక్కలు కత్తిరిస్తున్నారు. ఒక్కొక్కటిగా ఏరిపారేస్తున్నారు. ఇప్పటికే కార్మికుల నుంచి వీఆర్ఎస్​ కోసం ఒప్పందాలు చేసుకోవడం కొనసాగుతుండగా.. మరోవైపు 17 డిపోలను ఎత్తివేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఎత్తివేసే అవకాశం ఉన్న డిపోల్లో నుంచి బస్సులను సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా కార్మికుల పొట్టకొట్టే నిర్ణయం తీసుకుంటున్నారు. వేల మంది కార్మికులకు వచ్చే పెన్షన్​ నిలిపివేసేందుకు సమాయత్తమవుతున్నారు. సంస్థ వాటాను చెల్లించే పరిస్థితి లేదంటూ ఆర్టీసీ రిటైర్మెంట్​ బెనిఫిట్​ స్కీం బోర్డును ఎత్తివేసేందుకు ప్లాన్​ సిద్ధమైంది. ఎస్ఆర్బీఎస్​తో పాటుగా ఎస్బీటీ కూడా ఎత్తివేయనున్నారు. దీనిపై అధ్యయనం సైతం మొదలైందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ స్వయంగా వెల్లడించారు. తాజాగా దీనిపై రెండు రోజుల పాటు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​ ఆధ్వర్యంలో కూకట్​పల్లి బస్​ భవన్​లో సమావేశాలు నిర్వహించారు. దీన్ని ఎత్తివేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

దాచుకున్న సొమ్ముకు ఎసరు

ఆర్టీసీ కార్మికులు జీతాల నుంచి దాచుకున్న సొమ్మును కూడా యాజమాన్యం వదిలిపెట్టలేదు. ఆర్టీసీలో స్టాఫ్​​ రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ స్కీం (ఎస్​ఆర్​బీఎస్​) కింద కార్మికులు తమ వేతనాల్లో నుంచి ప్రతినెలా రూ. 250 చొప్పున దాచుకుంటున్నారు. దీనికి ఆర్టీసీ సంస్థ తరుపున కూడా ప్రతి ఏటా కొంత జమ చేస్తోంది. 2013 నుంచి సంస్థ తరుఫున విడుదల చేయాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా ఆపేసిన ఆర్టీసీ.. అప్పటి నుంచి కార్మికులు దాచుకుంటున్న సొమ్మును కూడా వాడేసుకుంది. కార్మికులు తమ వేతనాల్లో నుంచి ఎస్ఆర్​బీఎస్​కు జమ చేసుకున్న మొత్తం రూ. 450 కోట్లను వాడుకుంది. దీన్ని ఇంకా తిరిగి ఇవ్వలేదు. అంతేకాకుండా 2013లో ఆర్టీసీ సంస్థకు, ఎస్ఆర్బీఎస్​కు ఒప్పందం కుదిరింది. ప్రతి ఏడాది ఎస్​ఆర్​బీసీ బోర్డుకు రూ. 6.70 కోట్లు చెల్లించేందుకు అగ్రిమెంట్​ చేసుకున్నారు.

ఎస్​ఆర్​బీఎస్​ ప్రధాన కారణం.. ఉద్యోగులకు ప్రతినెలా వారు దాచుకున్న సొమ్ము నుంచి పింఛన్​ చెల్లించడమే. దీనిలో కనీస పింఛన్​ రూ. 500 నుంచి రూ. 2700 వరకు వస్తోంది. ప్రస్తుతం రిటైరవుతున్న వారికి ప్రతినెలా రూ. 2 వేల నుంచి రూ. 2700 వరకు పెన్షన్​ ఇవ్వాల్సి ఉంటోంది. ఆర్టీసీ కార్మికులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్​ సౌకర్యం లేకపోవడంతో.. ఈ బోర్డును ఏర్పాటు చేసుకున్నారు. అయితే, సంస్థ నష్టాల్లో ఉందనే సాకుతో కార్మికులు దాచుకున్న ఈ సొమ్మును కూడా యాజమాన్యం వాడేసుకుంది. దీనిని ఇంకా చెల్లించలేదు. అంతేకాకుండా 2013లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతిఏటా ఎస్​ఆర్​బీఎస్​కు రూ. 6.70 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ రూపాయి కూడా విడుదల చేయలేదు.

ఇప్పుడేం చేస్తున్నారు

ప్రస్తుతం ఎస్​ఆర్​బీఎస్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అల్రెడీ ఈ బోర్డుకు కార్మికులు ప్రతినెలా దాచుకున్న దాదాపుగా రూ. 20 కోట్ల వరకు ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా మూడేండ్ల కాలానికి రూ. 21 కోట్లు సంస్థ తరుఫున చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సి ఉంది. ఈ చెల్లింపులు ఆర్టీసీ భారంగా భావిస్తోంది. అందుకే ఎస్​ఆర్​బీఎస్​ను ఎత్తివేసేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయంతో కార్మికులకు కనీస పింఛన్​ కూడా రాదు. సర్వీసులో ఉన్నన్ని రోజులు ఎంతో కొంత నెలనెలా దాచుకునే అవకాశం ఇక లేనట్టే.

బకాయిలిస్తాం

తాజాగా ఆర్టీసీ కార్మికుల మెడపై కత్తి పెట్టింది. ఎస్​ఆర్​బీఎస్​ కింద ఇన్నేండ్లు దాచుకున్న సొమ్మును విడుతల వారీగా ఇస్తామంటూ సమాచారమిస్తోంది. పెన్షన్​ రూపంలో కాకుండా.. మొత్తం సొమ్మును లెక్కకట్టి పలు విడుతల్లో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇలా సర్దుబాటు చేస్తామని చెప్పి.. ముందుగానే దీన్ని పూర్తిగా ఎత్తివేయనున్నారు.

ఎస్​బీటీ కూడా ఖతం

అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు అత్యవసర సమయంలో అక్కరకు వచ్చే స్టాఫ్​ బెనివోలెన్ట్​ కమ్​ త్రిఫ్ట్​ ఫండ్​ (ఎస్​బీటీ)ని కూడా ఎత్తివేసేందుకు పరిశీలిస్తున్నారు. ఇది కూడా కార్మికులు దాచుకున్న సొమ్ము. దీనిలో సంస్థ రూపాయి ఇవ్వదు. ఎస్​బీటీ అంటే ప్రతినెలా కార్మికులు తమ వేతనాల్లో నుంచి రూ. 100 చొప్పున దాచుకుంటారు. దీన్ని రిటైర్మెంట్​ సమయంలో ఎంత వస్తే అంత చెల్లించనుండగా.. ఒకవేళ చనిపోతే రూ. 1.50 లక్షల ఆర్థిక సాయంతో పాటుగా అప్పటి వరకు దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇదంతా కార్మికుల సొమ్ము నుంచే. అయితే, దీనిలో కూడా కొంత మొత్తాన్ని ఆర్టీసీ సంస్థ వాడేసుకుంది. ఇప్పుడు ఎస్​బీటీ కూడా ఎత్తివేయాలని భావిస్తోంది.

సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నాం : వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఎండీ

ఎస్ఆర్‌బీఎస్, ఎస్‌బీటీ ఎత్తివేతపై అధ్యయనం చేస్తున్నాం. కమిటీ అధ్యయన నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం.

Tags:    

Similar News