‘కేటీఆర్.. దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ దగ్గరుకు రా’.. కాంగ్రెస్ నేత దయాకర్ సవాల్

‘మిస్టర్ కేటీఆర్.. దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ దగ్గరుకు రా.. పదేళ్ల పాలనలో ఎందుకు డీఎస్సీ వేయలేదు..? నిరుద్యోగులను రెచ్చకొట్టి చిల్లర

Update: 2024-07-09 15:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మిస్టర్ కేటీఆర్.. దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ దగ్గరుకు రా.. పదేళ్ల పాలనలో ఎందుకు డీఎస్సీ వేయలేదు..? నిరుద్యోగులను రెచ్చకొట్టి చిల్లర రాజకీయాలు చేయొద్దు’ అంటూ టీపీసీసీ స్పోక్స్‌ పర్సన్ చనగాని దయాకర్ ఫైర్ అయ్యారు. పేద పిల్లలకు చదువు, ఉద్యోగాలు ఆపే ప్రయత్నం చేస్తే పాపం తగులుతుందని శపించారు. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలపై కొందరు పింక్ బ్యాచ్ హింస వైపు మళ్లిస్తున్నారన్నారు. పదేళ్లు నిరుద్యోగులను గోస పెడితేనే బీఆర్ఎస్‌ను బొంద పెట్టారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే 30 వేల మందికి ఉద్యోగ పత్రాలు అందజేశామన్నారు.

దీంతో పాటు డీఎస్సీ ద్వారా 11 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం సిద్ధపడితే, బీఆర్ఎస్ దొంగ రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో బడులను మూసివేసి, కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహించారన్నారు. అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకులతో నిరసనలు, ధర్నాలు చేపించడం సిగ్గుచేటని విమర్శించారు. ఓయూలో రాకేష్ రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు తరిమిన సిగ్గు రాలేదన్నారు. ఇలానే వ్యవహరిస్తే, బీఆర్ఎస్ నేతలను తరమాల్సి వస్తుందని హెచ్చరించారు.


Similar News