సీఎం జగన్‌‌కు సోమువీర్రాజు బహిరంగ లేఖ

దిశ, ఏపీ బ్యూరో: నిరుద్యోగ యువతకు - BJP state president Somuveeraraj open letter to CM Jagan

Update: 2022-03-16 13:22 GMT

దిశ, ఏపీ బ్యూరో: నిరుద్యోగ యువతకు అవకాశలు కల్పిస్తానన్న ప్రభుత్వం నిరుద్యోగులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తానన్న హామీని గాలికి వదిలేసి నిరుద్యోగులను తీవ్ర నిరాశపరిచిందంటూ సీఎం జగన్‌‌కు బుధవారం సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. జాబ్ క్యాలండర్‌‌‌ను ప్రతి జనవరిలో ప్రకటిస్తానని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మిన నిరుద్యోగ యువత కోచింగ్‌ సెంటర్లలో రాత్రింబవళ్లు శిక్షణ తీసుకుంటూ అప్పులు చేసి మరి ఫీజు కడుతున్నారన్నారు.


నోటిఫికేషన్‌ జాడ ఉంటుందో లేదో తెలియదుగానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒకరోజు కాకపోతే మరొక రోజుయినా నేరవేరుతుందన్న ఆశతో డిగ్రీ పట్టాను చేతితో పట్టుకొని కోచింగ్‌ సెంటర్‌లో కాలం వెళ్లదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రభుత్వ శాఖలలో సుమారుగా 3 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాలం వెళ్లదీస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఇరిగేషన్‌ వ్యవస్థలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోవటంవల్ల త్రాగునీటి ప్రాజెక్టు అన్నీ నత్తనడకన జరుగుతున్నాయన్నారు. 3 వేలకు పైగా లస్కర్‌ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల రైతులకు సకాలంలో త్రాగు నీరు అందటం లేదని తెలిపారు.


రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల పౌరసంబంధ సేవలు ప్రజలకు అందడం లేదని వివరణ ఇచ్చారు. సమాచార శాఖలో ఉద్యోగ నియమకాలు జరపకుండా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో ఆయా శాఖాలో పారదర్శకత లోపిస్తోందన్నారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అని నిలదీశారు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో వంటి సంస్థల్లో డిగ్రీ పట్టా ఉన్న యువతకు అవకాశం కల్పించే విధంగా నిబంధనలను సరళీకృతం ఎందుకు చేయడం లేదన్నారు.

డిగ్రీ పట్టా సాధించి అర్హత వున్న వారికి ప్రభుత్వం ఉపాధి కల్పించడంలో, ఉద్యోగ అవకాశాలు కల్పించటంలోను ఆలసత్వం వహించడం వలన యువత తీవ్ర నిరాశతో ఉన్నారని పేర్కొన్నారు. జాబ్‌ క్యాలండర్‌ క్రియాశీలకంగా అమలుపరిచి వుంటే యువతకు సకాలంలో ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. మెగా డీఎస్సీ తెస్తారని బీఎడ్‌ చేసిన విద్యార్థులు నోటిఫికేషన్‌ కోసం కాళ్ళుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారన్నారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ చేయని కారణంగా శాంతి-భద్రతలు కాపాడే పోలీస్‌ శాఖ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు.


ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో ఉద్యోగ అవకాశాల కోసం ఇంజనీరింగ్‌ పట్టాలు పోందిన పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు. పదోన్నతులు ద్వారా కాకుండా నూతన రిక్రూట్ మెంట్ ద్వారా విద్యుత్‌‌శాఖలో నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. సోషల్‌ వెల్పేర్‌ డిపార్ట్‌మెంట్‌లో చాలా ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. ముఖ్యమైన ప్రభుత్వ శాఖల్లో అవుట్‌ సోర్సింగ్‌ వ్యవస్థపై ఆధారపడే పరిస్థితులను ప్రభుత్వం పరోక్షంగా కల్పిస్తున్నట్లు తెలుస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జూన్‌‌లో విడుదల చేసిన ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్‌‌లో గ్రూప్ 1,2 కలిపి కేవలం36 పోస్ట్ పేర్కొన్నారని అన్నారు. వేలల్లో ఖాళీగా ఉన్న వాటిని తెలపలేదని, గ్రూప్ 3,4 పోస్టులు ప్రస్తావన అసలే లేదని, పోలీస్ శాఖకు సంబంధించి 400 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని వివరించారు. గ్రూప్ -1 ఖాళీ పోస్టులు 93 ఉండగా క్యాలెండర్ లో కేవలం 16 పోస్ట్‌‌లే చూపించారన్నారు. గ్రూప్-2 లో 814 ఖాళీల భర్తీకి అవకాశం ఉందని కానీ 20 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో 1148 పోస్టులు ఖాళీ ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని ఆ శాఖ ప్రభుత్వాన్ని కోరిందన్నారు.


ఇందులో 17 డిప్యూటీ కలెక్టర్ గ్రూప్-1, 67 డిప్యూటీ తహశీల్దార్ గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కాని 84 పోస్టులలో ఏడు మాత్రమే జాబ్ క్యాలెండర్ లో చూపించారని మండిపడ్డారు. 339 గ్రూప్-3 పోస్టులు, గ్రూప్-4 లో 639 గ్రూప్-4 పోస్టులు దాచేశారని ఆరోపించారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే 768 ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులు ఖాళీగా ఉండగా ఒకటి కూడా క్యాలెండర్ లో చూపించలేదని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

కరోనా సమయంలో మాత్రమే వైద్య రంగంలో తాత్కాలిక నియామకాలను ప్రభుత్వం జరిపిందని, మినహా ఇతర నియామకాలు జరగలేదన్నారు. టీచర్ పోస్టులు 25 వేలు, కానిస్టేబుల్ పోస్టులు 16 వేలు, లైబ్రరీ సైన్స్ 6 వేల పోస్టులు, సచివాలయంలో 8 వేల పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్‌‌స్టాఫ్‌లలో అదేవిధంగా రాష్ట్రప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాట్లు వెల్లడించారు.

Tags:    

Similar News