HCU Land Issue : హెచ్సీయూ భూములపై మరోసారి ఆలోచించాలి : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో ప్రస్తుతం హెచ్సీయూ భూముల వివాదం(HCU Land Issue) తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ప్రస్తుతం హెచ్సీయూ భూముల వివాదం(HCU Land Issue) తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. ప్రతిపక్షాలు అన్నీ ఆ భూములను వర్శిటీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ భూముల్లో వైవిధ్యమైన జీవ సంపద ఉందని, ఆ అటవీ భూములను తొలగిస్తే పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటున్నాయి. తాజాగా ఈ వివాదంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy) స్పందించారు. హెచ్సీయూ భూములపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని సూచించారు. 50 ఏళ్లుగా ఆ భూముల్లో చెట్లు, కొండలు ఉన్నాయని.. వాటిలో వివిధ రకాల పక్షులు, జంతువులు నివసిస్తున్నాయని అన్నారు. ఇపుడు రాష్ట్ర ఆర్థికపరిస్థితి బాగోలేదని వర్సిటీ భూములు అమ్ముతారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రకృతి, విద్యార్థులకు నష్టం కలిగించొద్దని హితవు పలికారు.
గతంలో ఎన్నో ప్రభుత్వ భూములను తెగమ్మిన బీఆర్ఎస్ నేతలు ఇపుడు మాత్రం ధర్నా చేయడం విడ్డూరం ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక ఈ భూముల వివాదంపై టీజీఐఐసీ(TGIIC) కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది. దీనిపై వర్శిటీకి ఎలాంటి హక్కులు లేవని తెలిపింది. అయితే టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్సీయూ(HCU) ఖండించింది. ఈ భూములపై వర్సిటీలో ఎలాంటి సర్వే చేయలేదని పేర్కొంది. ఆ భూములు వర్శిటీవేనని హెచ్సీయూ అధికారులు అన్నారు.