వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్
నాపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చిలుకూరు బాలాజీ టెంపుల్ (Chilukuru Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్ (Priest Rangarajan) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: నాపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చిలుకూరు బాలాజీ టెంపుల్ (Chilukuru Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్ (Priest Rangarajan) అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ (Hyderabad Press Club) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రెండు నెలల క్రితం తనపై జరిగిన దాడి పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రంగరాజన్.. ఫిబ్రవరి 7వ తేదీన కొందరు తన ఇంటికి వచ్చి తలుపులు తట్టారని, ఆ సమయంలో స్నానం చేయకపోవడంతో టీషర్టుపై ఉన్న తాను ఇప్పుడు ఎవరినీ కలవలేను అని అన్నానని చెప్పారు.
అందులో నల్లబట్టలు వేసుకున్న ఓ వ్యక్తి రామరాజ్యం కోసం పని చేసే వారిని కలిసేందుకు సమయం కూడా లేదా మీకు అంటూ టేక్ హిం కస్టడీ అన్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన మాటలు విని పెద్ద ఆఫీసర్ ఏమో అని అనుకున్నట్లు తెలిపారు. అలాగే ఆయనతో పాటు 20 మంది తలుపులు తోసుకొని ఇంట్లోకి వచ్చారని, తనను కాళ్లు లాగి కిందపడేసి దాడి చేశారని తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి వెళ్లినట్లు చెప్పారు. దీనిని వదిలే ప్రసక్తే లేదని, కోర్టులో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామని అన్నారు. టెంపుల్ కి సంబంధించిన విషయం కోర్టులో ఉన్నదని, దీని వెనుక ఎంతటి వారున్నా సరే, శిఖండి లాగా వ్యవహరించవద్దని వ్యాఖ్యానించారు. దీనిపై కావాలంటే కోర్టులో వాదనలు వినిపించి, తాము తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలని అర్చకులు రంగరాజన్ అన్నారు.