భాగ్యనగరానికి బోనాల జాతర శోభ.. గోల్కొండ లో మొదలైన మెట్ల పూజ

ఆషాఢ మాసంలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకొనే బోనాల జాతర సందడి ఆదివారం నుంచి మొదలుకానుంది.

Update: 2024-07-06 03:17 GMT

దిశ, సిటీ బ్యూరో: ఆషాఢ మాసంలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకొనే బోనాల జాతర సందడి ఆదివారం నుంచి మొదలుకానుంది. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కొత్త సర్కారు కొలువుదీరడంతో ఈ సారి బోనాల జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. గోల్కొండలో మొదలై నెలరోజుల పాటు జరిగే బోనాల జాతరను పురస్కరించుకుని శుక్రవారం గొల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయ మార్గంలోని మెట్లకు స్థానికులు శుక్రవారం పూజలు చేశారు.

ఆదివారం నుంచి ఇక్కడ బోనాల సందడి మొదలుకానుంది. ఫస్ట్ గోల్కొండ కోటిలోని అమ్మవారికి తొట్టెల, తొలి బోనం సమర్పణ, ఫలహార బండ్ల ఊరేగింపులు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి వాటితో నగర వీధులు కోలాహలంగా మారనున్నాయి. గోల్కొండ కోటిలో నాలుగు వారాల పాటు కొనసాగే బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు, ఆ తర్వాత 21న లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల జాతర తర్వాత మళ్లీ బోనాల జాతరకు గొల్కొండ కోటలోని ముగిసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బోనాల జాతరను పురస్కరించుకుని నగరంలోని అమ్మవారి ఆలయాలను ముస్తాబు చేసుకునేందుకు సర్కారు దేవాయాల వారీగా నిధులను పంపిణీ చేస్తుంది. 14న లష్కర్ బోనాలు, 21న పాతబస్తీతో పాటు న్యూ సిటీలో జరిగే బోనాలు ప్రశాంతంగా జరిగేలా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా పాతబస్తీ వంటి సెన్సిటీవ్ ప్రాంతాల్లో భద్రత బలగాలను మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాగునీటి ఏర్పాట్లు

గోల్కొండ బోనాలకు వచ్చే భక్తుల కోసం జలమండలి తాగునీటి వసతి ఏర్పాట్లు చేస్తుంది. కోట ప్రారంభంలో ఉన్న మెట్ల దగ్గరి నుంచి మొదలుకుని బోనాలు జరిగే ప్రాంతం వరకు వివిధ స్థానాల్లో తాగునీటి పాయింట్లు ఏర్పాట్లు చేసింది. దీని కోసం అవసరమైన డ్రమ్ములు, సింటెక్స్ ట్యాంకులు, పంపులు, పైప్ లైన్‌తో పాటు వంట చేసే ప్రాంతంలో స్టాండ్లు కూడా సిద్ధం చేసింది. పైపు లైన్ ద్వారా తాగునీరు అందించేందుకు అవసరమైన ట్రయల్ రన్ అధికారులు ఇప్పటికే నిర్వహించారు.

ఇవే కాకుండా వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు కూడా అందుబాటులో ఉంచారు. వాటర్ క్యాంపుల దగ్గర టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. వీలును బట్టి ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా పాయింట్లు ఏర్పాటు చేశారు. అందులో రామదాసు బంధిఖాన, చోటాబజార్, జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం, లంగర్ హౌజ్ వద్ద కూడా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.

బోనాలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్న ఆషాఢ మాసం బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. శుక్రవారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ( శ్రీ జగదాంబిక ) ఆలయంను కలెక్టర్ నగర్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈనెల 7న గోల్కొండ కోటలో తొలి పూజ ప్రారంభమవుతున్నందున ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. పారిశుధ్యం బాగుండాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా పీస్ కమిటీ సహకరించాలన్నారు. ఈ పర్యటనలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కే శ్రీనివాస్ రెడ్డి, విశ్వజిత్ ప్రసాద్ డిప్యూటీ కమిషనర్ ఉదయ్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ మహిపాల్, తాసీల్దార్, వివిధ శాఖల అధికారులు పీస్ కమిటీ సభ్యులు, ఉత్సాహ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Similar News