TSRTC: టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఆ బస్సుల్లో కూడా 'టీ-9 టికెట్‌'

Update: 2023-07-07 16:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ, ప‌ట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన 'టీ-9 టికెట్‌' సమయాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్‌ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.

టీ-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబీ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్‌ వర్తిస్తుంది. టీ-9 టికెట్‌ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్‌ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.

‘‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టీ-9 టికెట్‌ను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రవేశపెట్టింది.ఈ టికెట్ ద్వారా రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. జూన్‌ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 11 వేల మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారు. టీ-9 టికెట్‌ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకువచ్చారు.

ఈ అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని సంస్థ పెంచింది. తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబీ టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ టికెట్‌ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. సంస్థను ఆదరించాలి." అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌,బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ​కోరారు.


Similar News