ఈడీ ఛార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు.. పార్టీ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ కీలక పిలుపు
‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది.

దిశ, వెబ్డెస్క్: ‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ మేరకు అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi) సహా పలువురి పేర్లను పేర్కొంది. ఇప్పటికే కేసుతో లింక్ అయి ఉన్న ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా, కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఇద్దరిపై దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లయింట్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై ఢిల్లీ స్పెషల్ కోర్టు ఈనెల 25న విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ.. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగబోతున్నట్లుగా ప్రకటించారు. ఛార్జిషీట్లలో సోనియా, రాహుల్ పేర్లను కక్షపూరితంగా చేర్చారని కామెంట్ చేశారు. రాజకీయ కక్షసాధింపులను నిరసిస్తూ రేపు నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపు..
ఈ క్రమంలోనే ‘నేషనల్ హెరాల్డ్’ కేసు చార్జిషీట్లో రాహుల్, సోనియా గాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగేందుకు సిద్ధమైంది. ఇవాళ అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రతిపక్షాలపై కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. చార్జిషిటలో తమ పార్టీ అధినేతల పేర్లు తొలగించేంద వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.