ROR Act-2024: ఇక గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగి..! సత్వర సేవలకు తప్పనిసరి

‘ఆర్వోఆర్-2024’ డ్రాఫ్ట్ బిల్లును పబ్లిక్ డొమెయిన్ లో పెట్టి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ముసాయిదాలోని అనేక అంశాల్లో క్షేత్రస్థాయి పరిశీలన, దర్యాప్తు, విచారణ వంటి పదాలను పొందుపర్చింది.

Update: 2024-08-11 02:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఆర్వోఆర్-2024’ డ్రాఫ్ట్ బిల్లును పబ్లిక్ డొమెయిన్ లో పెట్టి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ముసాయిదాలోని అనేక అంశాల్లో క్షేత్రస్థాయి పరిశీలన, దర్యాప్తు, విచారణ వంటి పదాలను పొందుపర్చింది. ఇవన్నీ సమర్థవంతంగా జరగాలంటే గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగి తప్పనిసరి అని స్పష్టమవుతున్నది. అంతేకాకుండా గ్రామ రెవెన్యూ (విలేజ్ అకౌంట్) రికార్డుల నిర్వహణ తప్పనిసరి అని పేర్కొన్నారు. గతంలో ఈ బాధ్యతలను వీఆర్ఓలు నిర్వర్తించేవారు. దీంతో అదే స్థాయి ఉద్యోగిని గ్రామాల్లో నియమించే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు రైతాంగానికి సత్వర సేవలందించాలంటే గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ అనివార్యమని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవ‌స్థకు సంబంధించిన ఓ ఉద్యోగి ఉండేటట్లు చూస్తామని చెప్పారు. దీంతో వీఆర్ఓ బదులుగా జూనియర్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లేదా మరే ఇతర పేరుతోనో ఉద్యోగిని అపాయింటే చాన్స్ కనిపిస్తున్నది.

పెండింగ్‌లో సమస్యల పరిష్కారం

గత ప్రభుత్వం రెవెన్యూ పాలనను అస్తవ్యస్తం చేసింది. ప్రత్యామ్నాయం లేకుండా వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేశారు. దీంతో కనీసం కుల, ఆదాయ, వారసత్వ ధ్రువ పత్రాల విచారణ, సంక్షేమ పథకాల అర్హుల జాబితాను రూపొందించేందుకు గ్రామ స్థాయిలో ఓ ఉద్యోగి లేకుండాపోయారు. అంతేకాకుండా రాష్ట్రంలో భూ సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ లక్షల్లో అప్లికేషన్లు పెండింగులో ఉన్నాయి. ఏ ఒక్కరి దరఖాస్తు కూడా నిర్దేశించిన గడువులోగా పరిష్కరించిన దాఖలాలు లేవు. ఒక్కో అప్లికేషన్ రికార్డులను వెరిఫై చేసి రిపోర్ట్ రాయాలంటే కనీసం మూడు, నాలుగు గంటలు పడుతున్నది. రెవెన్యూ ఇన్ స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్లు ఈ పనిని చేయాలంటే రోజుకు రెండు లేదా మూడు కంటే ఎక్కువ దరఖాస్తులను పరిశీలించలేరు. అందుకే రిజెక్షన్ అప్లికేషన్ల సంఖ్యనే 75 శాతం వరకు ఉన్నాయి. ఒక్కో సమస్య పరిష్కారానికి కనీసం ఏడాది సమయం పడుతున్నది. ఇదిలాగే కొనసాగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయం నెలకొన్నది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలన్నీ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే మేలు కలుగుతుందని ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు.

తప్పనిసరి ఎందుకంటే..

ఆర్వోఆర్-2024 ముసాయిదా ప్రకారం తాత్కాలిక భూదార్, శాశ్వత భూదార్, భూదార్ కార్డులు జారీ చేయాల్సి ఉన్నది. అంతేకాకుండా సాదాబైనామాల క్రమబద్ధీకరణ, దరఖాస్తుల పరిశీలన, వీలునామా, వారసత్వ విషయంలో మ్యుటేషన్ లో విచారణ, సెక్షన్-13 ప్రకారం గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, నిర్ణయించిన రీతిలో హక్కుల రికార్డుల తుది ప్రచురణ వంటి అంశాలను డ్రాఫ్ట్ బిల్లులో పొందుపర్చారు. ధరణి పోర్టల్ లో తప్పొప్పుల సవరణతోపాటు అసలే నమోదు కాకుండా పార్ట్-బీ కింద పేర్కొన్న సుమారు 18 లక్షల ఎకరాల డేటాను పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేయాల్సి ఉంది. ప్రభుత్వం పార్ట్-బీ కింద పేర్కొన్న వాటిని ఏబీసీడీ వర్గీకరణ చేయాలని నిర్ణయించింది. ఆ భూ సమస్యల స్థితి, స్థాయిని బట్టి ఎవరు పరిష్కరించాలనే దానికి త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించనున్నదని విశ్వసనీయంగా తెలిసింది. కోర్టు కేసులు మినహా మిగతా భూముల డేటాను పరిశీలించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇలాంటి అనేకాంశాల్లో గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది అవసరం అనివార్యంగా మారుతున్నది.

వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరణ సాధ్యమేనా?

అక్రమాల పేరుతో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన గత ప్రభుత్వం.. వారందరినీ ఇతర శాఖలకు పంపింది. వారిలో సగానికి పైగా ఉద్యోగులు ఇప్పటికీ ఆ శాఖల్లో ఇమడలేకపోతున్నారు. కొందరు దీర్ఘకాలిక సెలవు పెట్టారు. తిరిగి వ్యవస్థను పునరుద్ధరించాలంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఇంకొందరేమో సర్వీస్ మ్యాటర్ ని ఫైనల్ చేయండంటూ వేడుకుంటున్నారు. గిరిజన కార్పొరేషన్ కి బదిలీ అయిన 16 మంది ఉద్యోగులకు 20 నెలలుగా వేతనాలు రాలేదు. వారేమో తాము ఉద్యోగులామా? కాదా? అంటూ అందరినీ కలుస్తున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థల రద్దు తర్వాత ప్రత్యామ్నాయాలు, తలెత్తే సమస్యలను గుర్తించకుండా కేసీఆర్ సర్కార్ చేసిన కుంపటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. వేలాది మంది ఉద్యోగులను ఉన్నపళంగా ఇతర శాఖల్లోకి డెప్లాయ్ చేయడం అనే సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడా రద్దయిన వ్యవస్థల పునరుద్ధరణ సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. కానీ గ్రామీణ రెవెన్యూ నిర్వహణకు మాత్రం ఉద్యోగుల అవసరం ఏర్పడింది. అయితే ఎవరిని తీసుకుంటారోననే అంశంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వీఆర్వోల వరకేనా? అందరిని తీసుకుంటారా? అన్న విషయంలో స్పష్టత కొరవడింది.

Tags:    

Similar News