Payal Shanaker : రేవంత్ రెడ్డి కేంద్రంతో సఖ్యతతో ఉండాలి : బీజేపీ ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్(Nagarkarnool) జిల్లాలోని దోమలపెంట వద్ద గల ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(BJP MLA Payal Shankar) స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్(Nagarkarnool) జిల్లాలోని దోమలపెంట వద్ద గల ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(BJP MLA Payal Shankar) స్పందించారు. ఇది కేవలం ప్రమాదం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యమని మండిపడ్డారు. నాలుగేళ్ల తర్వాత పనులు ప్రారంభిస్తున్నపుడు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకే ఇంతటి ఘోర ప్రమాదం సంభవించిందని అన్నారు. టన్నెల్ లోపల యంత్రాలు విరిగి పోయినట్టు నిపుణులు చెబుతున్నారని, ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. అసలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ముందుకు సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మైక్ దొరికితే తిట్ల దండకం మొదలు పెడుతున్నారని, ఇలాంటి తిట్ల రాజకీయాలు చేస్తే ప్రభుత్వం ముందుకు సాగదని హితవు పలికారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కేంద్రంతో, కేంద్ర మంత్రులతో సఖ్యతతో ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయని సూచించారు. అయితే ఫిబ్రవరి 22 న ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కొంతభాగం కుప్పకూలి 8 మంది కార్మికులు అందులో చిక్కుకున్న విషయం తెలిసిందే. గత 10 రోజుల నుంచి వారిని బయటికి తీసుకు వచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా టన్నెల్ ప్రమాదస్థలానికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రమాద పరిస్థితిని, సహాయక చర్యలను అధికారులను మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు.