Revanth Reddy: సత్యహరిచంద్రులే అయితే గుండెలెందుకు బాదుకుంటున్నారు?: రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Update: 2024-07-29 07:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాల విషయంలో తమ నాయకుడు కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అన్నట్లుగా మాట్లాడిన బీఆర్ఎస్ సభ్యులు ఇవాళ జ్యుడీషియల్ కమిషన్ విచారణ రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యుత్ అంశంలో ఎంక్వైరీ వేస్తామని వేము అనలేదు. అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కోరడంతో ఛత్తీస్ గఢ్, యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై ఎంక్వైరీ కమిషన్ నియమించాం. కమిషన్ సమన్లు జారీ చేస్తే బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరై కేసీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాల్సింది పోయి కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ అంశంలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని సెగ తగలగానే కమిషన్ విచారణ వద్దంటూ కోర్టుకు వెళ్లారన్నారు. అయితే హైకోర్టులో వీరి వాదనను కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లారని అక్కడ అభ్యంతరం ఉంటే కమిషన్ చైర్మన్ ను మార్చాలని సూచిస్తూనే విచారణ మాత్రం జరగాల్సిందే అని తేల్చి చెప్పిందన్నారు. ఇవాళ సాయంత్రం లోపు విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ ను నియమిస్తామని సీఎం వెల్లడించారు. విద్యుత్ విషయంలో విచారణ చేస్తే బీఆర్ఎస్ నేతలు గుండెలు ఎందుకు బాధుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకే ఇస్తే కోర్టుకు ఎందుకు వెళ్లారు? ఇందులో ఫ్రాడ్ జరిగిందని ఆరోపించారు.

సోనియా గాంధీ దయవల్లే తెలంగాణకు విద్యుత్:

తెలంగాణకు విద్యుత్ వెలుగులు తీసుకువచ్చింది తామే తీసుకువచ్చినట్లుగా బీఆర్ఎస్ మాట్లాడుతున్నది. కానీ విభజన చట్టంలో వినియోగం ప్రాతిపదికన విద్యుత్ పంపకాలు చేసిందే యూపీయే ప్రభుత్వం అన్నారు. విభజన చట్టం ప్రకారం విద్యుత్ పంపకాలలో తెలంగాణకు 36 శాతం, ఏపీకి 64 శాతం వచ్చేలా ఉంటే జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేసి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీని ఒప్పించి తెంలగాణకు 53.46 శాతం ఇప్పించి కేంద్రం నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణను చీకట్ల నుంచి కాపాడారన్నారు. ఇక్కడ కూర్చున్నవారు, పొంకనాలు కొడుతున్న వారు ఏం చేయలేదన్నారు. తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్ మీద కేసు వేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తే నేను ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి చంద్రబాబును ఆపాం. మీరు కేసు వేస్తే ఇక్కడ టీడీపీకి పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుంది. కేసు వేయడానికి వీలు లేదని కొట్లాడి ఆపింది మేము అన్నారు. గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీదు అని దుయ్యబట్టారు. గతంలో ఇదే సభలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే ప్రతిపక్షంలో నేను ఉన్నారు. ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణకు చీకటి రోజులు అని పేర్లు కింద కొట్టి మార్షల్స్ ను పెట్టి నన్ను బయటకు ఈడ్చి బయటపడేశారు. నాడు నేను టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నా నిజాయితీగా మాట్లాడుతున్నానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టులు తెలంగాణ వచ్చాక ఉత్పత్తిలోకి రావడంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడిందన్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం జరిగితే విద్యుత్ కోతలు ఉండకూడదని రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కానీ సిగ్గులేకుండా ఇంకా విద్యుత్ ను మేమే ఉత్పత్తి చేశామని బీఆర్ఎస్ సభను తప్పుదోవ పట్టిస్తున్నది మండిపడ్డారు.

ఎక్కడ మెక్కిర్రో అంతా తెలుసు:

బీహెచ్ఈఎల్ పనులు ఇవ్వడంలో మీరు ఎక్కడ గండి కొట్టారు? ఎక్కడ బొక్కారు? ఎక్కడ మెక్కిర్రో మాకు తెలియదా? మేమేం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చామా? అని సీఎం వ్యక్తం చేశారు. బీహెచ్ఈఎల్ కు ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్ మెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యం మాత్రమే ఉంది. సివిల్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ సామర్థ్యం లేదు. కానీ తెలివితేటలు కలిగిన వీరు బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ కాంట్రాక్టులన్ని వీళ్ల బినామీలు, బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చారు. వీరి దోపిడి బయటకు వస్తుందనే ఊకదంపుడు ప్రసంగాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి, ఇండియా బుల్ సంస్థ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బీహెచ్ఈఎల్ నుంచి కొనుగోలు చేసి బకరా అయ్యారన్నారు. వీళ్లు చేసిన పనికి అధికారులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

Tags:    

Similar News