Kaleshwaram: అంతా కేసీఆరే చేశారు.. పీసీ ఘోష్ కమిషన్ కు కీలక డాక్యూమెంట్లు ఇచ్చిన మాజీ ఈఎన్సీ

పీసీ ఘోష్ కమిషన్ కు కీలక డాక్యూమెంట్లను మాజీ ఈఎన్సీ అందజేశారు.

Update: 2024-10-28 10:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం (Kaleshwaram) అంశంలో ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) ఎదుట రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు (Retired ENC Nalla Venkateshwarlu) మరోసారి హాజరయ్యారు. గతంలో రెండు సార్లు విచారణకు హాజరైన ఆయన తాజాగా సోమవారం మరోసారి కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ వద్దకు నల్లా వెంకటేశ్వర్లు పలు కీలక ఆధారాలు సమర్పించారు. డీపీఆర్ కు కేసీఆర్ ఆమోదం తెలిపిన డాక్యుమెంట్లు, అన్నారం ఆక్సిస్ చేంజ్ డాక్యూమెంట్లు, జియో టెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల వివరాలకు సంబంధించి తన వద్ద ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్లు, మినట్స్ దస్త్రాలను కమిషన్ కు అందజేశారు. విచారణ సందర్భంగా మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల (Sundilla) బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై పీసీ ఘోష్ ప్రశ్నించగా కాళేశ్వరం డీపీఆర్ ను నాటి సీఎం కేసీఆరే (KCR) ఆమోదించారని వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే కాళేశ్వరం డిజైన్లను కేసీఆర్ ఫైనల్ చేయాలని చెప్పినట్లు తెలిపారు. మేడిగడ్డ కుంగుబాటుకు నిర్వహణ లోపమే కారణమా ? మూడు బ్యారేజీల్లో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా 3 బ్యారేజీల్లో నీరు నింపాలని అప్పటి ప్రభుత్వాధి నేత చెప్పారని తెలిపారు. మేడిగడ్డ 7వ గేట్ కుంగుబాటుకు ఆపరేషన్, మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు.

ఘోష్ కమిషన్ ను ఆశ్రయించిన మహారాష్ట్ర రైతులు:

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ మహరాష్ట్ర (Mharastra) రైతలు ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ తాజాగా జస్టిస్ ఘోష్ కమిషన్ కు లేఖలు రాశారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని సుమారు 10 గ్రామాలకు చెందిన భూమిని సేకరించారని అయితే నిర్మాణం చేపట్టక ముందే సర్వే చేపట్టిన అధికారులు ఇక్కడ తప్పుడు నివేదికలు ఇచ్చారని బాధిత రైతులు వాపోతున్నారు. మేడిగడ్డ విషయంలో గత ప్రభుత్వం కనీస ప్రమాణాలు పాటించలేదన్నారు. తొలుత అధికారులు మేడిగడ్డ వల్ల తమ గ్రామంలో 378.2 హెక్టార్లు మాత్రమే అవసరపడుతుందని అంచనా వేస్తే ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత అదనంగా మరో 500 హెక్టార్ల వరకు భూమి ముంపునకు గురవుతున్నదని చెప్పారు. అదనపు ముంపుపై తాము ఆందోళన చేస్తే సర్వే చేయించారే తప్పా నోటిఫై మాత్రం చేయించలేదన్నారు. దీంతో తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తాము ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేసేలా సిరొంచి రైతులు పీసీ ఘోష్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.


Similar News