భూ నిర్వాసితుల సమస్యలపై చర్చకు సిద్ధం: ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్
భూ నిర్వాసితుల సమస్యలపై తాను చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: భూ నిర్వాసితుల సమస్యలపై తాను చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. హరీష్రావు తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. డేట్, టైమ్ ఫిక్స్ చేయాలని, సిద్ధిపేట్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చకు రావాలన్నారు. మల్లన్నసాగర్ పైన చర్చించడానికి మాజీ సీఎం కేసీఆర్ ను హరీష్ రావు తీసుకువస్తే తమ సీఎం రేవంత్ రెడ్డి వస్తారన్నారు. సిద్దిపేట, గజ్వేల్, చొప్పదండి, ధర్మపురి, ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమన్నారు. హరీష్ రావు పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడన్నారు. మల్లన్న సాగర్లో కేసీఆర్, హరీష్ రావు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. పరిహారం అడిగిన రైతు, నాయకులపై కేసులు పెట్టారన్నారు. తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.