కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ పై ప్రాజెక్ట్ సర్వ్ ఆన్లైన్ సెషన్..
తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్పై ప్రాజెక్ట్ సర్వ్ ఆన్ లైన్ సెషన్ ను ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రారంభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్పై ప్రాజెక్ట్ సర్వ్ ఆన్ లైన్ సెషన్ ను ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రారంభించింది. ఈ సెషన్ ను ఎక్ స్టెప్ ఫౌండేషన్ కలిసి నిర్వహిస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ సర్వ్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా అన్ని ప్రభుత్వ జూనియర్ మరియు వృత్తి కళాశాలల్లో విద్యా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ లోని నాంపల్లిలో ప్రభుత్వ వ్రుత్తి జూనియర్ కాలేజ్, చంచల్ గూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో డిజిటల్ క్లాసులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫ్యాకల్టీ కొరత, నైపుణ్యాల్లో అంతరాలు, డ్రాపౌట్ రేట్లు వంటి ప్రధాన సవాళ్లను పరిష్కరించేలా క్రుషి చేస్తామన్నారు. పరిమిత ఫ్యాకల్టీతో ఉన్న కాలేజీల్లో అంతరాయం లేకుండా విద్యను అందించడానికి భాగస్వామ్య డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా పాఠాలను ప్రసారం చేస్తారని తెలిపారు. దీంతో విద్యార్థులు డిజిటల్ క్లాసుల రూపంలో అవాంతరాలు లేకుండా బోధన పోందడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ సెషన్లో ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ స్కిల్స్పై కమ్యూనికేషన్ నిపుణుడు వరప్రసాద్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ప్రేరణ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నిబద్ధత, పట్టుదలతో అభ్యాసం, మనశ్శాంతి వంటి అంశాల ప్రాముఖ్యతను వివరించారు. శరీర భాష, విశ్వాసం వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ డిజిటల్ తరగతులను ప్రవేశపెట్టడం ద్వారా అభ్యాస అవకాశాలను పెంచుతోందన్నారు. ప్రాజెక్ట్ సర్వ్ తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.