కేసీఆర్ అత్తగారు ఊరు ముంపు గ్రామం.. పదేళ్లుగా సమస్యలు పరిష్కరించలే: పొన్నం

బడ్జెట్‌లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Update: 2024-07-25 13:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బడ్జెట్‌లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ మీద ఆయన మౌనం.. మీ స్నేహ పూర్వక ఢిల్లీలో దోస్తీ ,గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఉందని విమర్శించారు. శాసన సభలో మాట్లాడ చేతగాక డైవర్షన్ చేస్తున్నారని, కేసీఆర్ మా విజ్ఞప్తి, డిమాండ్ మన్నించి శాసనసభ కు వచ్చారని అనుకున్నాం.. కానీ మధ్యలోనే వెళ్ళిపోయారు.. బయట బడ్జెట్ మీద కామెంట్ చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కొంతమంది తమ జిల్లాలో ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్టుల సందర్శనకు పోతున్నారని, వారిని అడుగుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందన్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవానికి వస్తా అంటే మీరు రావద్దు వస్తే హెలికాప్టర్ పెలుస్తమనే పరిస్థితి ఆ రోజు అని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టు అప్పుడే పూర్తి చేసుకుని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుగా పేరు పెట్టుకున్నామన్నారు. నేడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి మిడ్ మానేరుకు వస్తాయని, వాస్తవంగా రెండు టీఎంసీల కోసం తీసుకున్న ప్రణాళిక ఇప్పటివరకు కూడా రెండు టీఎంసీలు వాడనే లేదన్నారు. ఆ నీళ్లను మిడ్ మానేరుకు తేవడానికి 2 వేల కోట్ల అదనపునిధులతో వృథా చేస్తూ మూడో టీఎంసీ కోసం రైతుల దగ్గర భూ సేకరణ చేసి రైతుల ధర్నా చేసే పరిస్థితి ఆనాడు అని పేర్కొన్నారు. స్వయంగా కేసీఆర్ అత్తగారు ఊరు కోదురుపాక.. మిడ్ మానేరు ముంపు గ్రామం అని, మేమంతా కలిసి మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని పదేళ్లుగా అడిగితే ఒక్కటి కూడా చేయలేదన్నారు. పది లక్షలు ఇస్తామన్నారు.. ఇవ్వలేదన్నారు.

రేపటి నుంచి మిడ్ మానేరుకి నీళ్ళు వస్తాయని, నీళ్ళు రాగానే మేమే ఇచ్చామని అంటారని, మా వల్లే వచ్చాయని చెప్పుకుంటారు.. అని విమర్శించారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టు ఒక కాలువ ద్వారా అంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ , మల్లన్న సాగర్ నీళ్లు పోతాయన్నారు. మరో కాలువ ద్వారా లోయర్ మానేరు ప్రాజెక్టు, లోయర్ మానేరు నుంచి కాకతీయ కాలువ ద్వారా తుంగతుర్తి వరంగల్, ఖమ్మం వరకు నీళ్లు పోతాయన్నారు. 90 టీఎంసీల శ్రీరాం సాగర్ ప్రాజెక్టు లో ఇప్పుడు 26 టీఎంసీల వాటర్ ఉందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర బ్యారేజీలు కట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాంత రైతాంగానికి సంబంధించి ముంపు గ్రామాల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదో ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని మీరు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క నాడు కూడా ఒక్క టీఎంసీ వాడకుండా ఇప్పుడు మూడో టీఎంసీ ఎవరి లబ్ధి కోసం తీసుకొచ్చారో చెప్పాలన్నారు. చెప్పిన తర్వాతనే అక్కడ అడుగు పెట్టాలన్నారు.

Tags:    

Similar News