తెలంగాణ హిస్టరీ కేసీఆర్.. ఫ్యూచర్ కేసీఆరే..
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఫ్యూచర్ తానేనని చెప్పుకుంటున్నాడని, అదెంత మాత్రం నిజం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
దిశ, ప్రతినిధిత, నిజామాబాద్ :సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఫ్యూచర్ తానేనని చెప్పుకుంటున్నాడని, అదెంత మాత్రం నిజం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరేనని ముఖ్యమంత్రిపై ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై స్ట్రెయిట్ గా పదునైన భాషనుపయోగించి విమర్శలు చేశారు. ఆయన మాట్లాడే మాటలపై వ్యంగాస్త్రాలు సంధించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మీరు ఏ విధంగానూ సరితూగరన్నారు. అలాంటి భ్రమ నుండి బయటకు రావాలని కవిత ఎద్దేవా చేశారు.
తమకు తెలంగాణ అంటే ఒక టాస్క్ అని, మీలాంటి వారికి, ఇతరులకు తెలంగాణ అంటే రాజకీయమన్నారు. కేసీఆర్ అంటే సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, నిద్రలో కూడా కేసీఆర్ కేసీఆర్ అంటూ కలవరిస్తున్నారని కవిత సెటైరికల్ గా మాట్లాడారు. "రైతుబంధు ఇవ్వను కానీ రఫ్ గా మాట్లాడుతా, రుణమాఫీ చెయ్యను కానీ బాగా రుబాబుగా మాట్లాడతా, సాగునీరు ఇవ్వను కానీ సోది ముచ్చట్లన్నీ చెబుతా, ఉద్యోగాలు ఇవ్వను కానీ ఉట్టి మాటలు చెబుతా, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వను కానీ తుఫెల్ మాటలు చెబుతానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. గౌరవ మర్యాదలు అనేటివి కొనుక్కుంటే వచ్చేవి కావని, మన నడవడిక, మాటతీరు, పని పేరు బట్టి ఉంటుందని చెప్పారు. కేసీఆర్ టీవీలో మాట్లాడితే టీవీ దగ్గరికి పోయి వాల్యూమ్ పెంచి మరీ ఆయనేం మాట్లాడుతున్నారోనని ఆసక్తిగా వింటారని, అదే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే టీవీని మ్యూట్ లో పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు.
చెప్పిందే చెప్పుడు తప్ప కొత్త ముచ్చట్లేం చెప్పేదేం ఉండదు.. చేసేదేం ఉండదని ప్రజలు విసుక్కుంటున్నారని కవిత రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పి తిట్లు తిని పాపాన్ని మూట కట్టుకోవద్దని కవిత సీఎంకు సూచించారు. రంజాన్ తోఫాలు ఎందుకు నిలిపేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంజాన్ సమయంలో మసీదుల సుందరీకరణ కోసం బీఆర్ఎస్ హయాంలో ఒక్కో మసీదుకు రూ. లక్ష ఇచ్చే వాళ్ళమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మసీదుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ముస్లింల వైపున ఏ పార్టీ నిలుస్తుందో దీన్ని బట్టి తేటతెల్లమైందని తెలిపారు. ముస్లింలకు ఇచ్చిన హామీలు అన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, తక్షణమే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఇఫ్తార్ విందులో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, మాజీ మేయర్ నీతుకిరణ్, మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా, మాజీ రెడ్కో చైర్మన్ అలీం,బాన్సువాడ వైస్ చైర్మన్ జుబేర్, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు శిర్పరాజు, సుజిత్ సింగ్ ఠాకూర్, మాజీ నూడ చైర్మన్ ప్రభాకర్, మాజీ టిఎస్పిఎస్ డైరెక్టర్ సుమిత్రానంద్, పార్టీ మైనార్టీ నాయకులు నవీద్ ఇక్బాల్ , ఇమ్రాన్, మతీన్, జాగృతి నాయకులు అవంతి రావు, రెహాన్, మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.