దిశ ఎఫెక్ట్....బోరు మోటారుకు మరమ్మతులు
తాగునీరు సరఫరా చేయమంటే పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య సమాధానంతో మహిళలు రోడ్డెక్కి రాస్తారోకో చేసి నిరసన చేపట్టిన దిశ కథనానికి అధికారులు స్పందించారు.
దిశ , నాగిరెడ్డిపేట్ : తాగునీరు సరఫరా చేయమంటే పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య సమాధానంతో మహిళలు రోడ్డెక్కి రాస్తారోకో చేసి నిరసన చేపట్టిన దిశ కథనానికి అధికారులు స్పందించారు. తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. మంగళవారం ఉదయం నాగిరెడ్డిపేట్ మండల కేంద్రం గోపాల్ పేట్ గ్రామంలోని సాయి నగర్ కాలనీలో గత నాలుగు రోజుల నుండి బోరు మోటారు కాలిపోయి తాగునీరు సరఫరా జరగకపోవడంతో కాలనీవాసులు గోపాల్ పేట్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని తాగు నీటిని సరఫరా చేయాలని అడగగా పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యపు సమాధానం
ఇవ్వడంతో కోపోద్రిక్తులైన కాలనీవాసులు ఖాళీ బిందెలతో బోధన్ - హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి పై చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ వార్త దిశ దినపత్రికలో ప్రచురితం కావడంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండల అధికారులకు తాగునీటిని వెంటనే సరఫరా చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంపీడీవో పర్బన్న, ఎంపీఓ ప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినోద్, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య లు కలిసి బోరు మోటర్ కు మరమ్మతులు చేయించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. సాయి నగర్ కాలనీలో తాగునీటి సరఫరా పునరుద్ధరణ కావడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.