అస్తవ్యస్తంగా రోడ్లు!.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణిస్తున్న వాహనదారులు

రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఆక్సిడెంట్లు అవుతాయని పోలీస్ శాఖ అధికారులు నిత్యం చెబుతూ ఉంటారు.

Update: 2024-08-25 02:58 GMT

దిశ, ఏర్గట్ల : రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఆక్సిడెంట్లు అవుతాయని పోలీస్ శాఖ అధికారులు నిత్యం చెబుతూ ఉంటారు. కానీ రోడ్లు బాగా లేకపోతే కూడా ప్రమాదాలు జరుగుతాయన్న విషయం ఆర్ అండ్ బి(R&B) అధికారులు మర్చిపోతున్నారు. అయితే ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా అంటే అవునన్నట్లుగానే ఉంది ఈ అధికారుల తీరు. వివరాల్లోకి వెళితే..ఏర్గట్ల మండల కేంద్రం నుంచి జగిత్యాల జిల్లా వర్ష కొండ వెళ్లే ప్రధాన రహదారి గుండా రెండు జిల్లాల ప్రజలు ప్రయాణిస్తుంటారు. అయితే తీగల వాగు తర్వాత ప్రయాణానికి వీలుకానంతగా రోడ్డు అధ్వానంగా మారింది.

వ్యాపార, ఆరోగ్య ఇతర అవసరాల కోసం ఏర్గట్ల మండలం నుంచి జగిత్యాల జిల్లా మెట్ పల్లికి, ఇబ్రహీంపట్నం మండలం నుంచి నిర్మల్, నిజామాబాద్ వైపు నిత్యం వందలాది మంది వెళ్తూ, వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రధాన రహదారి వర్షాల కారణంగా ఏర్పడిన భారీ గుంతలు వాహన చోదకులను భయపెడుతున్నాయి. ద్విచక్ర వాహన చోదకులు ఈ గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారు. వర్షాలకు ముందు చిన్నగా ఉన్న ఈ గుంతలు వాహనాల తాకిడికి పెద్దగవుతున్నాయి. చిన్న వర్షం కురిసినా ఈ గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారిపై గుంతల్లో నిండుగా నీరు ఉండడంతో వాహన చోదకులు అదుపు తప్పి పడిపోయి గాయపడుతున్నారు.

*అధికారులు తక్షణమే మరమ్మతులు చేయించాలని ప్రజల వినతి:

ఇక నిత్యం ఈ దారి గుండా ప్రయాణించే వాహనదారులు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయపడుతూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. అయినా కూడా సంబంధిత ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారంటూ వాహనదారుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెలుగు ఉన్నప్పుడే ప్రయాణించలేని పరిస్థితి ఉంటే, రాత్రి వేళల్లో మాత్రం ఆదమరిస్తే ఆసుపత్రికే అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఇదిలా ఉంటే నిత్యం పంట పొలాలకు వెళ్లే రైతులు తప్పని పరిస్థితిలో భయం భయంతో ప్రయాణించి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి తక్షణమే రహదారి మరమ్మతులు చేయాలని ప్రజలు, వాహనదారులు, రైతులు వేడుకుంటున్నారు.


Similar News