ఆస్తిని లాగేసుకున్నపెంచిన కొడుకు... ఆపై చిత్రహింసలు

తండ్రిని చిత్రహింసలు పెట్టి ఆస్తిని లాక్కున్న సంఘటన మండల పరిధిలోని రామంచ గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2024-05-30 10:53 GMT

దిశ, చిన్నకోడూరు : తండ్రిని చిత్రహింసలు పెట్టి ఆస్తిని లాక్కున్న సంఘటన మండల పరిధిలోని రామంచ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొమురవెల్లి ముత్తయ్యకు పిల్లలు లేకపోవడంతో తన అన్న కుమారుడైన శ్రీనివాస్​ను చిన్ననాటి నుండి పెంచుకున్నాడు. పెద్దయ్యాక కనకలక్ష్మితో వివాహం చేశారు. శ్రీనివాస్, కనక లక్ష్మి లతో పాటు ముత్తయ్య భార్య భర్తలు సికింద్రాబాద్ లోని సీసీ నగర్ లో ఉంటున్నారు. ఇటీవల ముత్తయ్య భార్య మరణించడంతో ఆయన తన స్వగ్రామమైన రామంచకు వచ్చి నివాసం ఉంటున్నాడు.

    తాను ఒంటరినైనానని మరో పెళ్లి చేసుకోవాలని ఆలోచన ముత్తయ్యకు కలిగింది. ఈ విషయం పెంచిన కొడుకు శ్రీనివాస్ కు తెలిసింది. మార్చి 5 వ తేదీన శ్రీనివాస్ ,భార్య కనగలక్ష్మి మరో ముగ్గురు కారులో వచ్చి ముత్తయ్య పై దాడి చేసి కారులో ఎక్కించుకొని సీసీ నగర్ సికింద్రాబాద్ కు తీసుకుపోయి రూములో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. మార్చి 12న ముత్తయ్యను హైదరాబాద్​ నుండి తీసుకువచ్చి

    తన పేరున ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆస్తితోపాటు బంగారం, వెండి, నగదును లాగేసుకున్నారు. తిరిగి సికింద్రాబాద్ కు తీసుకుపోయి రూమ్ లోనే నిర్బంధించారు. ముత్తయ్య ఎలాగో తప్పించుకొని రామంచకు చేరుకొని చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముత్తయ్య ఫిర్యాదు మేరకు ఐదుగురుపై కేసు నమోదు చేసి వారి నుండి డబ్బు నగలు స్వాధీనపరచుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. శ్రీనివాస్ కనక లక్ష్మి లను పట్టుకొని రిమాండ్ కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. 


Similar News