Crime : రెండేళ్ల చిన్నారి మురికి కాలువలో గల్లంతు

నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి గల్లంతయ్యింది.

Update: 2024-08-21 16:30 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి గల్లంతయ్యింది. వర్ని రోడ్ లోని ఆనంద్ నగర్ లో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆనంద్ నగర్ లో నివాసముండే పూజ, మారుతి దంపతుల రెండున్నరేళ్ల కూతురు అనన్య బుధవారం సాయంత్రం ఇంటి వద్ద ఖాళీ స్థలంలో ఆడుకుంటోంది. అప్పటి వరకు తల్లి పూజ కనుసన్నల్లోనే ఆడుతూ ఉన్న పాప కొద్ది సేపట్లోనే కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనతో చుట్టూ పక్కల పాప కోసం చూసిన తల్లికి తన బిడ్డ ఇంటి ముందు మురుగు కాలువలో పడిపోయిందనే అనుమానం కలిగి ఏడుస్తూ కేకలు వేసింది.

చుట్టూ పక్కల స్థానికులు చేరి పాప కోసం కాలువలో వెతికారు. ఆచూకీ దొరకకపోవడంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో కురిసిన భారీ వర్షానికి డ్రెయినేజీలో నీటి ప్రవాహం పెరిగి ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. సాయంత్రం నుంచి వెతుకుతున్నా చిన్నారి ఆచూకీని గుర్తించలేకపోయారు. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు పర్యవేక్షించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.


Similar News